మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య | Student commits suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

Aug 8 2018 2:22 PM | Updated on Nov 9 2018 4:36 PM

Student commits suicide  - Sakshi

 జైనబ్‌ మృతదేహం 

డిచ్‌పల్లి నిజామాబాద్‌ : మండలంలోని నడిపల్లి పంచాయతీ పరిధి గాంధీనగర్‌ కాలనీకి చెందిన ఎండీ జైనబ్‌(13) అనే విద్యార్థిని చదువుకునేందుకు స్కూల్‌కు పంపించడం లేదనే మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గాంధీనగర్‌ కాలనీలోని ఉమర్‌ సిద్దిఖీ కూతురు జైనబ్‌ గతేడాది ధర్మారం(బి) గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసింది. ఈ విద్యాసంవత్సరంలో తల్లిదండ్రులు జైనబ్‌ను స్కూల్‌కు పంపించకుండా ఇంటి వద్దే ఉంచారు.

తాను స్కూల్‌కు వెళ్లి చదువుకుంటానని ఎన్నిసార్లు అడిగినా తండ్రి పంపించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు జైనబ్‌ను కిందకు దించి ప్రాణం ఉందేమోనని పరీక్షించారు. అప్పటికే చనిపోయిందని తెలిసి డిచ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. జైనబ్‌ సోదరుడు ఇటీవల మానసికంగా అనారోగ్యానికి గురికావడంతో అతడికి చికిత్స చేయిస్తున్నారు.

దీంతో జైనబ్‌ను స్కూల్‌ మాన్పించి ఇంట్లో ఉంచారు. చదువుపై మక్కువ ఉన్న జైనబ్‌ మనస్తాపానికి గురై తన ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తండ్రి ఉమర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement