నాటు తుపాకితో కాల్చి..మామను చంపిన అల్లుడు | Son In law Killed Uncle With Gun in East Godavari | Sakshi
Sakshi News home page

నాటు తుపాకితో కాల్చి..మామను చంపిన అల్లుడు

Nov 22 2018 11:00 AM | Updated on Nov 22 2018 11:00 AM

Son In law Killed Uncle With Gun in East Godavari - Sakshi

తూర్పుగోదావరి, వై.రామవరం (రంపచోడవరం): ఓ అల్లుడు నాటుతుపాకీతో కాల్చి తన మామను హతమార్చాడు.  మండలంలోని రేగడిపాలెం గ్రామంలో రాకోటవీధికు చెందిన రాకోట ఆదిరెడ్డి (50) ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహానికి బుధవారం ఉదయం అడ్డతీగల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రాజవొమ్మంగి మండలం, దూసరపాముకు చెందిన ఇళ్లాపు దారబాబు అనే వ్యక్తి సోమవారం రాత్రి నాటు తుపాకీతో ఆదిరెడ్డిని కాల్చి చంపాడు. మండలంలోని లోతట్టు ప్రాంతం కావడంతో ఆలస్యంగా మంగళవారం సాయంత్రానికి  పోలీసులకు సమాచారం అందింది.

అడ్డతీగల సీఐ ఎ.మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆయన కథనం ప్రకారం.. మృతుడు ఆదిరెడ్డి రెండో కుమార్తెతో నిందితుడు దారబాబు కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నాడు. ఇలా చేస్తే తమ కుటుంబం పరువు పోతుందని, పెద్దలకు తెలిపి, తన కుమార్తెను వివాహం చేసుకోవాలని ఆదిరెడ్డి అడిగాడు. దీనికి ఆగ్రహించిన నిందితుడు దారబాబు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఆదిరెడ్డిని కాల్చగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్టున్నట్టు తెలిపారు. నిందితుడిపై  క్రైమ్‌ నంబర్‌ 39/18 యు/ఎస్‌ 302 ఐపీసీ, అండ్‌ సెక్షన్‌Œ 27(1) ఆఫ్‌ ఇండియన్స్‌ ఏఆర్‌ఎంఎస్‌ యాక్ట్‌ 1959 సెక్షన్ల కింద వై.రామవరం పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. మృతదేహాన్ని బుధవారం సాయంత్రం మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై ఎన్‌.సతీష్‌బాబు, వారి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement