‘డిక్కీ’ దొంగ ఆటకట్టు

Robbery Gang Arrest in Hyderabad KBR Park - Sakshi

బంజారాహిల్స్‌: కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కు వచ్చేవారి వాహనాల నుంచి చాకచక్యంగా నగదు, విలువైన వస్తువులు చోరీ చేస్తున్న వ్యక్తిని కేబీఆర్‌ పార్కు వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటర్‌సెప్టర్‌ వెహికిల్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ క్రైం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కుకు వచ్చే వాకర్లు తమ బైక్‌లను పార్కు సమీపంలో పార్కింగ్‌ చేస్తుంటారు. వీరిలో కొందరు యాక్టీవా బైక్‌ల సీట్ల కింద  తమ పర్సులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర వస్తువులను భద్రపరిచి లోపలికి వెళ్తుంటారు. దీనిని అదునుగా తీసుకుని గత కొంత కాలంగా అయ్యప్ప సొసైటీ ప్రాంతానికి చెందిన  సత్యనారాయణ స్క్రూడ్రైవర్‌తో సీటు తొలగిస్తూ అందులో ఉన్న వస్తువులు తస్కరిస్తున్నాడు.

గత నెల రోజుల్లో ఎనిమిది చోరీలకు పాల్పడ్డాడు. గురువారం ధరంకరం రోడ్డుకు చెందిన రఘు అనే వ్యక్తి తన బైక్‌ను పార్కింగ్‌ చేసి లోపలికి వెళ్లగా దీనిని గుర్తిం,ఇన సత్యనారాయణ డిక్కీలో నుంచి రూ. 4,800 నగదు తీసుకొని జేబులో పెట్టుకుంటుండగా పార్కు ముందు డ్యూటీలో ఉన్న ఇంటర్‌సెప్టర్‌ వెహికిల్‌ కానిస్టేబుళ్లు ప్రవీణ్‌కుమార్, మల్లికార్జున్‌ యాదవ్, హోంగార్డు రాజేశ్వర్‌జీ అతడిని గుర్తించారు. దీనిని పసిగట్టిన సత్యనారాయణ పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించాడు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ మీదుగా సందులోకి పరిగెత్తుతుండగా పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. నిందితుడిని బంజారాహిల్స్‌ క్రైం పోలీసులకు అప్పగించారు. గత కొంత కాలంగా పార్కింగ్‌ చేసిన వాహనాల్లోంచి సెల్‌ఫోన్లు, నగదు చోరీకి గురవుతున్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top