వ్యభిచార గృహాలపై పోలీసుల ఉక్కుపాదం

Police Riding Brothal Houses In Yadadri Continues - Sakshi

సాక్షి, యాదాద్రి : పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో అసాంఘీక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. యాదాద్రిలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 15 మంది చిన్నారులను వ్యభిచార రొంపి నుంచి పోలీసులు కాపాడారు. గుట్టలో దాడులు జరుగుతున్నాయన్న సంగతి తెలుసుకున్న కొందరు నేరగాళ్లు ఇళ్లకు తాళాలు వేసి చిన్నారులతో సహా పరారయ్యారు. వీరందరూ సిద్ధిపేట, ధర్మపురి, నిజామాబాద్, రామాయంపేటలకు వెళ్ళి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. చిన్నారులకు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్న ఆసుపత్రిని సీజ్ చేసి ఆర్‌ఎంపీ డాక్టర్‌ని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు డాక్టర్‌ల ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో వ్యభిచారం పూర్తిగా నిర్ములించాలని, నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

యాదాద్రిలో వ్యభిచార గృహాలను నడుపుతున్న వారికి నాయకుడిగా భావిస్తున్న యాదగిరి అనే వ్యక్తి ప్రస్తుతం పీడీ యాక్ట్‌ కేసులో వరంగల్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ జైల్లో నుంచే చక్రం తిప్పుతూ చిన్నారుల అక్రమ రవాణాను నిర్వహిస్తున్నాడని సమాచారం. కాగా, ఇప్పటికే యాదగిరి ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిద్ధం అవుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top