రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు | Sakshi
Sakshi News home page

యూపీ కిడ్నాప్‌ కేసులో అనూహ్య మలుపు

Published Tue, Jul 16 2019 12:18 PM

UP Police To Hand Over Girl to Kidnappers - Sakshi

లక్నో : ఓ కిడ్నాప్‌ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. కిడ్నాపర్ల చెర నుంచి యువతిని రక్షించిన పోలీసులు తిరిగి ఆమెను కిడ్నాపర్లకే అప్పగించారు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇది వాస్తవం. ఇంతకు ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. కుటుంబ సభ్యులే సదరు యువతిని కిడ్నాప్‌ చేశారు. వివరాలు.. మత్లూబ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి కుమార్తె ఈ నెల 11న ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లి పోయింది. అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ.. అలహబాద్‌ హై కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు ప్రాంగంణంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంటను కిడ్నాప్‌ చేశారు. దాంతో పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి సదరు జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే దర్యాప్తులో యువతి కుటుంబ సభ్యులే ఆ జంటను కిడ్నాప్‌ చేశారని తెలిసింది. దాంతో యువతి తండ్రిని, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం ఆ జంటను వారి చెర నుంచి విడిపించారు. కథ సుఖాంతం అయ్యింది అనుకుంటుండగా.. సదరు యువతికి మైనారిటీ తీరలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో ఆ యువతిని తిరిగి కుటుంబ సభ్యులకే అప్పగించారు పోలీసులు. ఇదిలా ఉండగా యువతి తండ్రి మత్లూబ్‌ అహ్మద్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో శివపాల్‌ యాదవ్‌ ప్రగతిశీల్‌ సమాజ్‌వాది పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement
Advertisement