ముఖం చూపలేక మృత్యు ఒడికి  | Person Commited Suicide In Khammam | Sakshi
Sakshi News home page

ముఖం చూపలేక మృత్యు ఒడికి 

Jul 13 2019 7:54 AM | Updated on Jul 13 2019 9:29 AM

Person Commited Suicide In Khammam - Sakshi

వీరన్న మృతదేహం

సాక్షి, రఘునాథపాలెం: అతడికి, ఆమెకు వేర్వేరుగా కుటుంబాలున్నాయి. పిల్లలు ఉన్నారు. కానీ..వివాహేతర సంబంధం కారణంగా అన్నీ మరిచి, కొన్నిరోజులు ఎటో పారిపోయి తిరిగి వచ్చిన వారికి ఇంటికెళ్లేందుకు ముఖం చెల్లలేదు. సమాజం చీదరించుకుంటుందని జంకారు. చివరికి చావాలని పురుగులమందు తాగి ఒకరు ప్రాణాలు వీడగా, సదరు మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.  రఘునాథపాలెంకు చెందిన ఇస్లావత్‌ వీరన్న(30) సుతారీ పని చేస్తూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుతారీ పనులప్పుడు ఏడాది క్రితం ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని గొల్లగూడెంకు చెందిన ఒక వివాహిత ఫర్జానతో పరిచయం ఏర్పడింది.

ఇది కాస్తా..చివరికి వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఫర్జానాకు కూడా భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈక్రమంలో 10 రోజులు క్రితం  వీరిద్దరూ వారి కుటుంబాలను వదిలేసి ఎటో పారిపోయారు. గురువారం అర్ధరాత్రి వీరన్న గ్రామం అయిన రఘునాథపాలెం వచ్చారు. ఊరిలోకి వెళ్లడానికి ముఖం లేక ఎటు వెళ్లాలో అర్థంగాక ఊరి సరిహద్దునే ఉన్న చెరువు గట్టుపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇద్దరు పురుగుల మందు తాగి అక్కడే పడిపోయారు.

తెల్లవారు జాము సమయంలో చెరువు గట్టుపై అరుపులు వినపడడంతో సమీపంలోని వారు వెళ్లి చూడగా..ఇద్దరూ చావు బతుకుల మధ్య నోటి నుంచి నురగలు కక్కుతూ కనిపించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా..శుక్రవారం వీరన్న మృతి చెందాడు. ఫర్జానా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వీరన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. ఫర్జానా అదృశ్యం అయినట్లు  కుటుంబసభ్యులు 10రోజుల క్రితమే అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా..వారు ఆమె వద్దకు చేరుకున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement