ఆన్‌లైన్‌ మోసం..! | online fraud in khammam | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మోసం..!

Apr 21 2019 8:36 AM | Updated on Apr 21 2019 8:36 AM

online fraud in khammam - Sakshi

కొణిజర్ల : ఆన్‌లైన్‌ ద్వారా ఓ ఉపాధ్యాయుడి ఖాతా నుంచి నగదు డ్రా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు శనివారం బాధిత ఉపాధ్యాయుడు పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన మేకల శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయుడికి కొణిజర్ల మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్‌లో ఎకౌంట్‌ ఉంది. ఈ నెల 18వ తేదీ రాత్రి 10గంటల నుంచి 19వ తేదీ తెల్లవారు జామున 2గంటల వరకు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 14 సార్లు ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేశారు. మొత్తం రూ.2,803లు నగదు విత్‌ డ్రా అయ్యాయి. విషయాన్ని గమనించిన ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ అధికారులు ఖాతాను బ్లాక్‌ చేసి శుక్రవారం ఖాతాదారుడికి సమాచారం అందించారు. శనివారం బ్యాంకుకు వెళ్లిన శ్రీనివాసరావు తన ఖాతాను పరిశీలించుకోగా ఖాతా నుంచి నగదు డ్రా చేసినట్లు ఉంది.

డబ్బు పెద్ద మొత్తంలో డ్రా చేయనప్పటికీ తనకు తెలియకుండా ఖాతా నుంచి నగదు పోవడం పట్ల ఉపాధ్యాయుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు నగదు విత్‌డ్రా అయినట్లు సంక్షిప్త సమాచారం వచ్చింది కానీ తక్కువ మొత్తంలో కావడంతో బ్యాంకు వారు ఎకౌంట్‌ మెయింటినెన్స్‌ కింద ఏమైనా తీసుకున్నారేమో అనుకున్నానని తెలిపారు. ఇలా 14సార్లు రావడంతో అనుమానంతో బ్యాంకుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. నెలనెలా జీతాలు పడుతుంటాయని ఆ సమయంలో దొం గతనానికి పాల్పడితే తమగతి ఏమి కావాలని సద రు ఉపాధ్యాయుడు వాపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆన్‌లైన్‌ మోసం గా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement