డ్యూటీకి అని చెప్పి మొదటి భార్య ఇంటికి.. | Married Man Cheat Young Women in Hyderabad | Sakshi
Sakshi News home page

పెళ్లి కాలేదని చెప్పి మరో వివాహం

Jul 18 2020 8:23 AM | Updated on Jul 18 2020 8:33 AM

Married Man Cheat Young Women in Hyderabad - Sakshi

అవుసలి సంపత్‌

రాంగోపాల్‌పేట్‌:  చదువుకోవడానికి నగరానికి వచ్చిన ఓ యువతికి తనకు ఇంకా పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. తీరా ఆమె 9 నెలల గర్భవతి అయ్యాక సరిగ్గా ప్రసవానికి ముందు చెప్పా పెట్టకుండా ఉడాయించాడు. దీంతో ఆమె తెలిసిన వారి సహాయంతో ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. మహంకాళి పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన ఎస్‌కే షబీనా (25) కొన్నేళ్ల క్రితం చదువుకునేందుకు నగరానికి వచ్చి ఈసీఐఎల్‌లో ఉండేది. అక్కడే ఓ స్నేహితురాలి ద్వారా నిందితుడు అవుసలి సంపత్‌ (29)తో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. తనకు పెళ్లి కాలేదని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పాడు.అతని మాటలు నమ్మి 2018 మార్చి 14న పెళ్లి చేసుకుంది. అయితే సంపత్‌కు అప్పటికే పెళ్లై భార్య, ఒక కుమార్తె కూడా ఉంది. మొదటి భార్య వనస్థలిపురంలో నివసిస్తోంది. పెళ్‌లైన తర్వాత కొద్ది నెలలుగా షబీనా, సంపత్‌లు ఆవులమందలో నివాసం ఉన్నారు.

రెండో పెళ్లి చేసుకున్నాక తరచు రాత్రి పూట డ్యూటీకి వెళుతున్నానని చెప్పి మొదటి భార్య ఇంటికి వెళ్తూ వచ్చేవాడు.  రెండో భార్య షబీనాతో కలిసి సంపత్‌ మే 31న ఈసీఐఎల్‌లో ఉండే తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకున్న విషయం చెప్పాడు. జూన్‌ 3న తిరిగి ఇంటికి వచ్చారు. ఆ మరుసటి రోజు  మొదటి భార్య, ఆమె సోదరుడు వచ్చి ఇంటి దగ్గర గొడవ పడ్డారు. దీంతో సంపత్‌ వారితో పాటు వెళ్లిపోయాడు. అటు తర్వాత ఫోన్‌ చేయడం కానీ, తిరిగి ఇంటికి రావడం కానీ చేయలేదు.దీంతో ఆమె మహంకాళి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా...   భర్త చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడంతో నిండు గర్భిణి అయిన షబీనా ఒంటరిగా బాలానగర్‌లో చిన్న గదిలో ఒంటరిగా ఉంటోంది. ఓ మహిళ సహాయం రాగా ఈ నెల 9న కోఠిలోని మెటర్నటీ ఆస్పత్రిలో చేరి బాబుకు జన్మనిచ్చింది. భర్త ఎప్పుడు వస్తాడా అని ఆమె ఎదురు చూస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement