వివాహేతర బంధం: భార్య, కూతురిపై కత్తితో..

Man Attacks Wife And Daughter Knife - Sakshi

రాయగడ : రాయగడలోని న్యూకాలనీ ఆంధ్రాబ్యాంక్‌ దగ్గరలో శనివారం ఉదయం ఓ వ్యక్తి తన భార్యా, కుమార్తెలపై హత్యాయత్నం చేశాడు.  ఈ హత్యాయత్నంలో భాగంగా భార్య శరీరమంతా  కత్తితో పొడుస్తూ, తల, చేతులు, కడుపులో కత్తితో పొడవగా ఆమె కేకలు విన్న కుమార్తె ఇంట్లోకి వెళ్లి చూసేసరికి కుమార్తెపై కూడా హత్యాయత్నం చేస్తూ తల, చేతులపై కత్తితో పొడిచాడు. ఈ యత్యాయత్నం ఘటనపై తల్లీకూతుళ్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కాశీపూర్‌ సమితి పొహండి గ్రామానికి చెందిన రఘునాథ్‌ నాగ్‌(52) రాయగడ వచ్చి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. రాయగడలోని న్యూకాలనీలో భార్యా కూతురుతో ఉంటున్నాడు. రఘునాథ్‌ పనిపాటా చేయకుండా భార్య, కుమార్తె సంపాదనపై జీవనం సాగిస్తున్నాడు.  భార్య లీల (43) కుమార్తె గాయత్రి (20) హోటల్‌లో పని చేస్తున్నారు.

భార్యా, కుమార్తె తనను కిడ్నాప్‌ చేసి ఇతర ప్రాంతంలో విక్రయిచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి కల వచ్చిందని దీనిపై భయాందోళన చెందిన తాను భార్య,  కుమార్తెపై హత్యాయత్నం చేశానని రఘునాథ్‌నాగ్‌  పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ సందర్భంగా రాయగడ ఏఎస్సై పి.రమణ కేసు నమోదు చేసి రఘునాథ్‌నాగ్‌ను అరెస్ట్‌ చేశారు. రఘునాథ్‌నాగ్‌ విలేకరులతో మాట్లాడుతూ తనకు కల వచ్చిందని కలలో తనను కిడ్నాప్‌ చేసి ఇతర ప్రాంతంలో విక్రయిస్తున్నారని, దానిని తాను నమ్ముతున్నానని, భార్య,పిల్లలతో కంటే జైల్లోనే ఆనందంగా జీవించగలనని అందుకే హతాయత్నం చేశానని తెలిపాడు.  రఘునాథ్‌ నాగ్‌ తన గ్రామంలో సొంత భార్యను విడిచిపెట్టి చాలా సంవత్సరాల క్రితం రాయగడ చేరుకున్నాడు. ప్రస్తుతం ఉంటున్న భార్య లీల కూడా భర్తను విడిచిపెట్టి రఘునాథ్‌తో జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top