దారుణం: కరోనా అంటూ కొట్టిచంపారు

Maharashtra Man Beaten To Death In Bihar - Sakshi

పట్నా : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తోటివారికి అండగా నిలవాల్సిందిపోయి కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కరోనా అనుమానితులుగా భావిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి బిహార్‌ చేరుకున్న ఓ కార్మికుడిని స్థానికులు దారుణంగా కొట్టి హతమార్చారు. ఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన ఓ కార్మికుడు ఉపాధి కోసం​ మహారాష్ట్ర వలస వెళ్లాడు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. (కరోనా వైరస్‌: వారిపైనే ఫోకస్‌)

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అతను కుటుంబంతో సహా.. స్వస్థలం బిహార్‌కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్థానికులు ఆ కార్మికుడిని స్వగ్రామంలోకి అనుమతించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే వారిద్దరు అతనిపై దాడి చేసి హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top