ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య | Killing girlfriend .. boyfriend suicide in rajanna dist | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య

Dec 29 2017 3:36 AM | Updated on Dec 29 2017 10:04 AM

Killing girlfriend ..  boyfriend suicide in rajanna dist - Sakshi

ఇల్లంతకుంట (మానకొండూర్‌): పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటలో గురువారం జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతారానికి చెందిన వొల్లాల ఎల్లయ్య– భారతమ్మల చిన్న కొడుకు మధు(25) హైదరాబాద్‌లోని ఓ బ్రెడ్‌ కంపెనీలో కార్మికుడు. వీరి ఇంటి సమీపంలోనే ఉండే మిట్టపల్లి వెంకటమ్మ కుమార్తె సుస్మిత(22) బీఈడీ చదువుతోంది. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుష్మిత తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కులాలు వేరుకావడం, కూతురు పుట్టినప్పుడే తనను భర్త వదిలేసి వెళ్లటం, తనలాగే కూతురి జీవితం కాకూడదని భావించింది. వీరు దూరంగా ఉంటున్నట్లు నమ్మించేందుకు మధు హైదరాబాద్‌కు వెళ్లాడు.

అయితే, గురువారం సిద్దిపేటలో మధు స్నేహితుడి వివాహం జరిగింది. వివాహానికి వచ్చిన మధు సుస్మిత కు ఫోన్‌ చేశాడు. అప్పటికే కళాశాలకు వెళ్లిన సుస్మిత అనుమతి తీసుకొని  ఎప్పుడూ కలుసుకునే ముస్కాన్‌పేటలోని కోళ్లఫారం వద్దకు వెళ్లింది. మధు కూల్‌డ్రింక్, క్రిమిసంహారక మందు తీసు కొచ్చాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో కలసి చనిపోదామని చెప్పాడు. సుస్మిత నిరాకరించి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా, మధు ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె కన్నుపోయింది. తర్వాత ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు. తర్వాత కోళ్లఫారంలో దూలానికి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందే విషయాన్ని సిద్దిపేటలోని స్నేహితుడికి అతడు ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలిసింది. స్నేహితులు వచ్చి చూడగా, ఇద్దరూ శవాలై కనిపించారు. ఇరువురి కుటుంబాలకు వారు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement