ప్రియుడికి ఇంట్లో బంగారం ఇచ్చిందన్న అనుమానంతో!

Husband Who Murdered His Wife With Suspicion - Sakshi

సాక్షి, కనిగిరి: వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపేశాడు. ఈ సంఘటన పట్టణంలోని ఇందిరా కాలనీలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన ఎస్‌కే ఫాతీమా (32)తో మండలంలోని తాళ్లూరుకు చెందిన ఎస్‌కే పాచ్ఛా సాహెబ్‌ అలియాస్‌ పాచ్ఛాకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం కాపురాన్ని పట్టణానికి మార్చారు. కొద్ది రోజులుగా పట్టణంలోని జవహర్‌లాల్‌ వీధిలో కాపురం ఉంటున్నారు. భర్త తాళ్లూరులోనే పాల వ్యాపారం, టైలరింగ్‌ చేస్తుండగా భార్య ఇటీవల స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చేరింది. ఈ క్రమంలో భార్య ఫాతిమా వివాహేతర సంబంధంపై భర్త నిలదీస్తూనే ఉన్నాడు.

అంతేగాక ఆమె తన ప్రియుడికి ఇంట్లోని బంగారు ఆభరణాలు కూడా ఇచ్చింది. ఈ వ్యవహారంపై కూడా కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గోడవలు తీవ్ర తరమయ్యాయి. అదే విషయాన్ని భార్య ఫాతీమాను భర్త గట్టిగా నిలదీశాడు. ఆమె ఆయనపై ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. ఆగ్రహం చెందిన భర్త.. ఆమె ముఖాన్ని కాల్చాడు. ఆపై తీవ్రంగా కొట్టి చపాతి కర్రతో గొంతు నులిమి చంపాడు. భార్య ఉరేసుకుని చనిపోయిందని నమ్మబలికే ప్రయత్నంలో భాగంగా ఫ్యానుకు చీర కట్టాడు.  తమ కుమార్తెను అల్లుడే అనుమానంతో చంపాడని మృతురాలి తల్లి ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ, సీఐ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తానే తన భార్యను చంపినట్లు భర్త పాచ్ఛా అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top