వివాహిత ఆత్మహత్య

Husband Fornication Relation Wife Suicide In West Godavari - Sakshi

భర్త వివాహేతర సంబంధమే కారణం

ప్రియురాలి తల్లిదండ్రుల వేధింపులు

సూసైడ్‌ నోట్‌ రాసి ఉరివేసుకుని మృతి

పశ్చిమగోదావరి, తణుకు: ‘‘నా భర్త వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనికి ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, అతని భార్య సహకరిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా జీవితాన్ని వీళ్లంతా సర్వనాశనం చేశారు. నాకు వేరే దిక్కు లేదు. మూడేళ్ల వయసున్న నా కొడుకును ఒంటరిగా వదిలి చనిపోతున్నాను. నా భర్తకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి ఇకపై ఎవరి కాపురాల్ని కూల్చకుండా ఉంటుంది. రెండేళ్లలో ఆమె పరిస్థితి కూడా నాలాగే తయారవుతుంది.’’ ఇలా సూసైడ్‌ నోట్‌ రాసి తనువు చాలించిందో వివాహిత. తణుకు పట్టణంలోని పాలంగి రోడ్డులో ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కాళిశెట్టి అనంతలక్ష్మి (29) బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కాళిశెట్టి శివకుమార్‌ స్థానికంగా ఎస్‌బీఐలో ఉద్యోగి. వీరికి మూడేళ్ల షన్వీర్‌ ఉన్నాడు. వీరు  2015 ఏప్రిల్‌ 22న ద్వారకాతిరుమలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో పెద్దల ఇష్టం లేకపోయినా వీరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి పాలంగి రోడ్డులోని ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక అనంతలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గురువారం ఉదయం కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

భర్త వివాహేతర సంబంధం వల్లే
పట్టణంలోని భారతీయ స్టేట్‌ బ్యాంకులో పని చేస్తున్న శివకుమార్‌ ఆచంట మండలం కొడమంచిలి గ్రామానికి చెందిన తమ్మిన సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమార్తె అనంతలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే శివకుమార్‌కు రాజమండ్రికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈమె తండ్రి ఏఎస్సై కావడంతోపాటు ఆమెకు సహకరిస్తుండటంతో ఆమె సోదరుడు సైతం తనను బెదిరిస్తున్నాడని అనంతలక్ష్మి సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఈ క్రమంలో పెళ్లి అయిన నాటి నుంచి శివకుమార్, అనంతలక్ష్మి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం తిరుపతి వెళుతున్నానని చెప్పి శివకుమార్‌ ప్రియురాలితో టూర్‌ వెళ్లాడని తెలుసుకుని అతనితో అనంతలక్ష్మి ఫోన్‌లో ఘర్షణ పడింది. ఇదిలా ఉంటే తన ఇంటి సమీపంలోని మరో అపార్టుమెంటులో ఉంటున్న శివకుమార్‌ తల్లి సుబ్బలక్ష్మి వద్దకు వెళ్లిన అనంతలక్ష్మి తన కుమారుడు షన్వీర్‌ను దించి వెళ్లింది.

తాను పనిమీద బయటకు వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయింది. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో ఆమెకు ఫోన్‌ చేశారు. ఫోన్‌ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా లోపల బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అనంతలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అయితే తన అల్లుడు శివకుమార్, ఆయన ప్రియురాలు, తల్లిదండ్రులు తన కుమార్తె మృతికి కారణమంటూ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top