ఇంటికి నిప్పు..

House Burned In Warangal - Sakshi

కమలాపూర్‌(హుజూరాబాద్‌): గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటికి నిప్పం టించగా ద్విచక్రవాహనంతోపాటు తలుపులు, కిటికీలు, ఇంట్లోని సామగ్రి మొత్తం దగ్ధమైన సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలోని దేశరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నద్దునూరి సమ్మయ్య ఇంట్లోకి రెండు నెలల క్రితం ఉడుము వచ్చింది. దీంతో మూడు నెలల పాటు ఇల్లు వదిలి పెట్టాలనడంతో రెండు నెలలుగా హన్మకొండలో నివాసం ఉంటున్నాడు.

కాగా సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి పొగలు, మంటలు వస్తున్నాయని చుట్టుపక్కల వారు ఫోన్‌ చేసి చెప్పగా అతడు గ్రామానికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే ఇంటి తలుపులు, కిటికీలు, ఇం ట్లోని పల్సర్‌ ద్విచక్రవాహనం, రెండు బీరువాలు, రెండు డెకోలం మంచాలు, ఒక కుట్టుమిషన్, కూలర్, టీవీ, బీరువాలోని ఐదు తులాల బంగా రు ఆభరణాలు, దుస్తులు, సర్టిఫికెట్లు తదితర సామాగ్రి కాలిబూదిదైంది. సుమారు రూ.5లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుం బీకులు బోరున విలపించారు.

పథకం ప్రకారమేనా?
దగ్ధమైన సమ్మయ్య ఇంటి ఆవరణను పరిశీలిస్తే పథకం ప్రకారమే ఇదంతా చేసినట్లుగా బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఆవరణలో పడి ఉన్న కట్టర్, ప్రధాన ద్వారానికి బిగించిన బెడెం తెగి ఉన్నాయి. కట్టర్‌తో బెడం కట్‌ చేసిన దుండగులు ఇంట్లోకి వెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు.

దిలీప్‌పై అనుమానం..
దేశరాజుపల్లి గ్రామంలోనే ఎల్లబోయిన దిలీప్‌ ఈ పనికి ఒడిగట్టి ఉంటాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దిలీప్, తన కూతురు సుమారు ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత గొడవలు జరగడంతో పెద్దల తీర్పు మేరకు తన కూతురుకు కొంత మొత్తం డబ్బులు చెల్లించి ఏడాది క్రితం విడాకులు తీసుకున్నారన్నారు. తన నుంచి డబ్బులు వసూలు చేశారని మనసులో పెట్టుకొన్న దిలీప్‌ తన స్నేహతుడు శ్రీనివాస్‌తో కలిసి తాము ఇంట్లో లేని సమయం చూసి ఇదే అదనుగా భావించి తమ ఇంట్లో పెట్రోల్‌ పోసి నిప్పంటించి దహనం చేసి ఉంటాడని సమ్మయ్య, అతడి కూతురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
దేశరాజుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారం మేరకు ఎస్సై సందీప్‌కుమార్‌ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన ఇంటిని పరిశీలించి బాధిత కుటంబీకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. బాధితుడు సమ్మయ్య ఫిర్యాదు మేరకు దిలీప్, అతడి స్నేహితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top