‘రేణుకా.. భోజనానికి వస్తున్నా..సిద్ధం చెయ్’ | Home Guard Commits Suicide In KHAMMAM | Sakshi
Sakshi News home page

భార్యకు ఫోన్‌ చేసి..హోంగార్డు ఆత్మహత్య 

Jun 6 2018 11:28 AM | Updated on Jun 6 2018 11:33 AM

Home Guard Commits Suicide In KHAMMAM - Sakshi

మృతదేçహాన్ని సందర్శిస్తున్న సీపీ, అడిషనల్‌ డీసీపీ

ఖమ్మంక్రైం : ‘రేణుకా.. భోజనానికి వస్తున్నా.. తయారు చేసి ఉంచు’ అని భార్యకు ఫోన్‌ చేసిన ఓ హోంగార్డు.. ఇంటికి వెళ్లకుండానే అనంతలోకాలకు పోయిన ఘటన ఖమ్మం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఫోన్‌ చేసి గంటలు గడస్తున్నా భర్త రాకపోవడంతో ఆ ఇల్లాలు అతడి సెల్‌కు ఫోన్‌ చేస్తే స్పందన లేదు.

తర్వాత కాసేపటికే ‘నీ భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ’ వచ్చిన ఫోన్‌తో కుప్పకూలిపోయింది. తన ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆ హాంగార్డు లేఖ రాసి పెట్టాడు. వివరాలిలా ఉన్నాయి..  కొణిజర్ల మండలం పెద్దగోపతికి చెందిన రుద్రగాని సైదారావు (40) సీపీ కార్యాలయంలోని సీసీఆర్‌బీలో హాంగార్డుగా పని చేస్తున్నాడు.

రోజూ ఊరి నుంచి వచ్చి వెళ్తుంటాడు. మంగళవారం కూడా విధులకు హాజరైన సైదారావు సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్‌లోని గోడపక్కనున్న చెట్టు కింద అపస్మారకస్థితిలో ఉండగా.. క్రికెట్‌ ఆడుతున్న విద్యార్థులు చూసి   ఏఆర్‌ సిబ్బందికి తెలిపారు. వారు వచ్చి చూసేసరికే సైదారావు మృతిచెందాడు.

పక్కన గుళికల ప్యాకెట్‌ ఉంది. సమాచారం తెలియగానే హెడ్‌ క్వార్టర్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ మృతదేహన్ని సందర్శించి  కుటుంబసభ్యులను ఓదార్చారు. హాంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు.  అడిషనల్‌ డీసీపీ సురేస్‌కుమార్, ఏసీపీలు రామానుజం, వెంకటేశ్వర్లు, విజయబాబు, ఆర్‌ఐ శ్రీనివాస్‌ మృతదేహాన్ని సందర్శించారు.  

ఆర్థిక ఇబ్బందుల వల్లే.. 

తాను ఆర్థిక ఇబ్బందులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాని, ఎవరూ కారణం కాదని సైదారావు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. కాగా, మంగళవారం ఉదయం  డ్యూటీ కి బయలుదేరే ముందు తన స్నేహితుడిని కలిసిన సైదారావు.. తనకు ఎల్‌ఐసీపాలసీ ఉందని, తాను మృతిచెందితే కుటుంబానికి హాంగార్డులు అంతా కలిసి ఒకరోజు వేతనాన్ని అందిస్తారని చెప్పాడు.

అయితే సైదారావు సరదాగా మాట్లాడుతున్నాడని భావించానని మిత్రుడు విలపిస్తూ చెప్పాడు. సైదారావు చిన్నపాటి ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడని, డబ్బులు ఇవ్వాల్సిన వారు ఇబ్బంది పెట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు అంటున్నా రు. మృతదేహన్ని పోలీస్‌ వాహనం వజ్రలో పెద్దగోపతికి తరలించారు. వనటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement