ఆస్తి కోసం డిగ్రీ విద్యార్థినికి వేధింపులు

Harassment on Degree Student For Assets And Suicide Attempt - Sakshi

నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నం

చీరాల: ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులు పెడుతున్న వేధింపులు తాళలేక డిగ్రీ చదువుతున్న విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చుట్టుపక్కల వారు గమనించి 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుని వైద్య సేవలు పొందుతోంది. వివరాలు.. మండలంలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయతీకి చెందిన గుర్రం డైసీ చీరాల పట్టణంలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది.

తల్లిదండ్రులు చిన్న తనంలో చనిపోవడంతో తాతయ్య జార్జి, నాయనమ్మల వద్ద నివాసం ఉంటోంది. డిగ్రీ చదువుతున్న డైసీ బొడ్డురాయి ప్రాంతానికి చెందిన పవన్‌ అనే యువకుడిని ప్రేమిస్తోందని బంధువులకు తెలిసింది. ఉమ్మడి ఆస్తి డైసీ ప్రేమిస్తున్న పవన్‌ అనే యువకుడికి వెళ్తుందన్న అక్కసుతో నెల నుంచి బంధువులు తనను మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. ఆస్తి వారికి చెందేలా సంతకాలు చేయాలని తాతయ్య జార్జి, పెద్దమ్మ సంతోషం, పెదనాన్న, ఇతర కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెడుతుండటంతో వాటిని భరించలేక నిద్రమాత్రలు మింగినట్లు ఆమె ఔట్‌ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధిక మొత్తంలో నిద్రమాత్రలు మింగిన బాధితురాలిని 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా ఔట్‌పోస్టు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top