మత్తు మందిచ్చి బాలికపై లైంగికదాడి | A Girl Brutally Assaulted At Kolanukonda Village | Sakshi
Sakshi News home page

మత్తు మందిచ్చి బాలికపై లైంగికదాడి

Dec 28 2019 5:42 AM | Updated on Dec 28 2019 5:42 AM

 A Girl Brutally Assaulted At Kolanukonda Village - Sakshi

పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాలిక బంధువులు

తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో బాలికకు మత్తు మందిచ్చి ఖాశింవలి అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లికి ఆరోగ్యం బాగోలేదని నమ్మబలికి వేరే ఊరులో ఉన్న ఆ బాలికను రప్పించి.. మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లి, బంధువులు శుక్రవారం రాత్రి 10 గంటలకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు... కొలనుకొండ గ్రామంలో నివాసం ఉండే ఖాశిం వలి, అతని భార్య రసూల్‌బీ స్థానికంగా వడ్డీ వ్యాపారస్థులు. బాధిత బాలిక తల్లి, వారి కుటుంబసభ్యులు పూసలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. బాధిత బాలికను ఖాశిం వలి ఈ ఏడాది రంజాన్‌ మాసంలో తన ఇంటికి తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

విషయం బయటపడటంతో మత పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. అనంతరం బాలికను వేరే ప్రాంతంలోని మదరసాకు తరలించారు. ఈ నెల 22న బాలిక తల్లికి ప్రమాదం జరిగిందని మదరసా వద్దకు వెళ్లి  ఖాశిం వలి ఆ బాలికకు తెలిపాడు. ఈ విషయాన్ని బాలిక మదరసా పెద్దలకు చెప్పడంతో వారు నమ్మలేదు. దీంతో బాలిక గోడ దూకి వచ్చి ఖాశిం వలితో కొలనుకొండ వచ్చింది. బాలిక బంధువులు తిరునాళ్ల కోసం ఊరు వెళ్లడంతో.. తమ ఇంటికి తీసుకెళ్లి మరోసారి ఖాశిం వలి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని భార్య కూడా ఈ దారుణానికి సహకరించింది. ఈ నేపథ్యంలో బాలిక వారి నుంచి తప్పించుకుని విజయవాడకు వెళ్ళగా, స్వచ్ఛంద సంస్థకు చెందినవారు ఆమె నుంచి వివరాలు సేకరించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు బాలిక బంధువులు, తల్లికి సమాచారం అందించడంతో వారు శుక్రవారం రాత్రి 10 గంటలకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఖాశింవలిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement