కిడ్నాపర్ల ముఠా అరెస్ట్‌      | A gang of kidnappers arrested | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్ల ముఠా అరెస్ట్‌     

May 18 2018 1:36 PM | Updated on May 18 2018 1:36 PM

A gang of kidnappers arrested - Sakshi

పట్టుబడ్డ నిందితులు

భువనగిరిఅర్బన్‌ : కిడ్నాపర్ల ముఠాను భువనగిరి రూరల్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గురువారం భువనగిరిలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రామచంద్రారెడ్డి ముఠా వివరాలను వెల్లడించా రు. భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో నివాసం ఉంటున్న సైదాచారి ఒక రాజకీయ నాయకుడి వద్ద మేనేజర్‌గా పని చేసేవాడు. సైదాచారి గ్రామంలో ఉన్న వెంకట్‌రెడ్డి, యశోధ, మరో మహిళ అనిత వద్ద అత్యధికంగా వడ్డీ చెల్లిస్తానని రూ.70లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

అందులో సగభాగం రూ.35లక్షలు తీర్చాడు. మిగతా డబ్బులు సైదాచారి చెల్లించకపోవడంతో వీరు ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కొనగండ్ల సురేశ్, తాడోజు నాగరాజును ఆశ్రయించారు. సైదాచారి వద్ద డబ్బులు ఉన్నట్లుగా తెలుసుకున్న సురేశ్, నాగరాజుతోపాటు మరో ఐదుగురు వ్యక్తులను కలుపుకుని సైదాచారిని మే 10న కిడ్నాప్‌ చేసి తమ కారులో భువనగిరి నుంచి వలిగొండ మీదుగా తొర్రూర్‌ వైపుగా వెళ్లారు. రూ.50లక్షలు ఇస్తేనే నిన్ను విడిచిపెడుతామని సైదాచారిని బెదిరించి విడిచిపెట్టారు.

దీంతో సైదాచారి వారిపై భువనగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల వలిగొండలో సీసీ కెమెరాల్లో కారులో వెళ్తుండగా కనిపించారు. వాటి ఆధారంగానే దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈరోజు అనాజిపురం గ్రామంలో అనుమానాస్పద వాహనంలో తిరుగుతుండగా వారిని పట్టుకుని తమదైన శైలిలో విచారించగా కిడ్నాపర్లు చేసిన తప్పును ఒప్పుకున్నారు. వారి నుంచి కారు, ల్యాప్‌ట్యాప్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సురేశ్‌తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి భువనగిరి కోర్టుకు రిమాండ్‌ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ జితేందర్‌రెడ్డి, రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ రాఘవేందర్‌ పాల్గొన్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement