అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు | Fire To The House In Mancherial | Sakshi
Sakshi News home page

అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు

Jun 22 2018 11:20 AM | Updated on Sep 5 2018 9:47 PM

Fire To The House In Mancherial - Sakshi

గాయపడ్డ చిన్నలింగన్న,నిందితుడు మారుతి

ముథోల్‌ : భార్యను కాపురానికి పంపడం లేదంటూ ఓ ప్రబుద్ధుడు అత్తింటికి నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో అత్తామామలతోపాటు భార్య, అతని ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. స్తానికులు సమయానికి కాపాడడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ముథోల్‌ మండల కేంద్రంలోని ముక్తాదేవిగల్లీకి చెందిన రోళ్ల మారుతి అదే గ్రామానికి చెందిన  భాగ్యలక్ష్మిని పన్నెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

వీరికి ఈశ్వర్, మల్లేశ్‌ ఇద్దరు కుమారులు. కొద్ధి రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య  పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. దీంతో తాగుడికి బానిసైన మారుతి బుధవారం రాత్రి అత్తారింటికి వచ్చి మరోసారి భార్యతో గొడవ పడి వెళ్లాడు. మళ్లీ వేకువజామున వచ్చి ఇంటి రేకులు తొలగించి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు ఈశ్వర్, మల్లేశ్, అత్త కళ, మామ చిన్నలింగన్న మంటల్లో చిక్కుకొని తీవ్రంగా  గాయపడ్డారు.

కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బయటకు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీనివాస్, ఎస్సై భరత్‌ సుమన్‌ సంఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన వారిని భైంసా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడ్డ మారుతి ముథోల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య, అత్తమామల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement