ఘోరం: పిల్లాడిని సిగరెట్‌తో కాల్చి చంపిన తండ్రి

Father Burns Son With Cigarette In Bangalore - Sakshi

బెంగళూరు : పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యులకు చూపించి మందులు వాడతారు. కానీ దీనికి భిన్నంగా ఓ తండ్రి భూతవైద్యుని సలహాతో తన మూడేళ్ల కొడుకు ఒంటిపై విచక్షణా రహితంగా సిగరెట్లతో కాల్చడంతో చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘోరం కోలారు జిల్లా మాలూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. మారుతి కాలనీకి చెందిన హరీష్, రేణుక దంపతులకు పృథ్వి (3) అనే కుమారుడున్నాడు. బెంగళూరుకు చెందిన వీరు ప్రేమ వివాహం చేసుకుని ఇక్కడ నివసిస్తున్నారు. హరీష్‌ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  

వారంరోజులగా సిగరెట్లతో వాతలు  
చిన్నారి పృథ్వి అంత చురుగ్గా ఉండేవాడు కాదు. ఇటీవల ఒక భూతవైద్యుని వద్దకు తీసుకెళ్లగా, వాతలు పెట్టాలని సూచించాడు. దాంతో వారంరోజుల నుంచి సిగరెట్‌తో వాతలు పెడుతున్నారు. మంగళవారం ఒక గుడికి తీసుకెళ్లి అక్కడ స్నానం చేయించగా, వాతలు పుండ్లుగా మారడంతో తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో బాలుడిని పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఘటనపై బాలుని తాత నంజుండప్ప పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి హరీష్‌ , రేణుకా దంపతులను అరెస్టు చేశారు. తల్లిదండ్రులిద్దరూ ప్రతి విషయంలో సైకోల మాదిరిగానే ప్రవర్తించేవారని స్థానికులు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top