రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి

Father And Son Died In Road Accident At Enkuru - Sakshi

మృత్యువు నుంచి బయటపడిన మరో కుమారుడు

కేసుపల్లిలో విషాద ఛాయలు

సాక్షి, ఏన్కూరు: సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. మరో కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ సంఘటన మండల పరిధిలోని కేసుపల్లి సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... కేసుపల్లి గ్రామానికి చెందిన గుగులోతు రాంబాబు(40) తన ఇద్దరు కుమారులు వినోద్, విష్ణు(12)లను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని సరుకుల కొనుగోలుకు ఏన్కూరు వచ్చాడు.

సరుకులు కొనుగోలు చేసిన అనంతరం ద్విచక్రవాహనంపై తన ఇద్దరు కుమారులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో తూతకలింగన్నపేట సమీపంలో సాగర్‌ కాల్వలో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు కేసుపల్లి నుంచి ట్రాక్టర్‌ బయలుదేరింది. గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ ఎదురుగా వచ్చే ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రాంబాబు చిన్న కుమారుడు విష్ణు(12) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలయిన రాంబాబును ఏన్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాంబాబు మృతి చెందాడు. రాంబాబు పెద్ద కుమారుడు వినోద్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కుమారుడు, భర్త మృతి చెందడంతో పద్మ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాదం నుంచి బయటపడిన వినోద్‌.. తండ్రి, తమ్ముడి మృతదేహాల మీద పడి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి ఎస్‌హెచ్‌ఓ కోటేశ్వరరావు, సిబ్బంది వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top