కూతురిపై అనుమానం, కత్తితో దాడి

doubt on daughter..assault with knife - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కోరుకొండ మండలం కొత్తజంబు పట్నంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పడాల కొండా రెడ్డి అనే వ్యక్తి వరసకు కూతురైన బాలికపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వివరాలు..గ్రామానికి చెందిన పడాల కొండారెడ్డికి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగినా మనస్పర్థలతో భార్యను వదిలేశాడు. అదే గ్రామానికి చెందిన లోవమ్మ కూడా 17 ఏళ్ల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిగింది. మనస్పర్థలతో మొదటి భర్తతో విడిగా ఉంటోంది. లోవమ్మకు వీర వెంకట లక్ష్మి(15) అనే కూతురు ఉంది. కొన్నేళ్ల నుంచి కొండారెడ్డి, లోవమ్మలు పెద్దలు, బంధువుల అంగీకారంతో సహజీవనం సాగిస్తున్నారు.

అయితే వీరి మధ్య మూడు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే వరసకు కూతురైన లక్ష్మి ఎవరినో ప్రేమిస్తుందని అనుమానం పెంచుకున్నకొండారెడ్డి లక్ష్మితో గొడవపడ్డాడు. కోపంతో తన దగ్గరున్న బ్లేడుతో మెడ కోశాడు. ఛాతీ, చేతిలపై కూడా ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. మెడపై మాత్రం తీవ్రగాయం కావడంతో హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. కొండారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు రాజమండ్రి డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top