రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Couple Died In Lorry Accident Anantapur - Sakshi

అనంతపురం, మడకశిర: మండల పరిధిలోని వైబీహళ్ళి రోడ్డులో పత్తికుంట క్రాస్‌ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో వైబీహళ్ళి గ్రామానికి చెందిన భార్యాభర్తలు నాగరత్నమ్మ(35), రంగస్వామి(39) అక్కడిక్కడే మృతి చెందారు. సీఐ దేవేంద్రకుమార్, ఎస్‌ఐ గోపియాదవ్‌ కథనం మేరకు... నాగరత్నమ్మ, రంగస్వామి ద్విచక్రవాహనంలో మడకశిరకు బయల్దేరారు. పత్తికుంట క్రాస్‌ రోడ్డు మలుపు వద్దకు వచ్చేసరికి అటువైపు నుంచి వస్తున్న ట్రాక్టర్‌ వారిని ఢీకొంది. కింద పడిపోయిన భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ, ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు చనిపోవడంతో వారి కుమారుడు అభిలేష్‌(4), రెండో తరగతి చదువుతున్న కుమార్తె చందన అనాథలయ్యారు.

భార్యను మడకశిరలో దింపేందుకు వస్తూ..
రంగస్వామి భార్య నాగరత్నమ్మ రెండు సంవత్సరాల నుంచి పరిగిలోని ఇండియాన్‌ డిజైన్‌ కంపెనీలో పని చేస్తున్నారు. రోజూ ఆటోలో మడకశిరకు వచ్చి తిరుగు ప్రయాణంలో బస్సులో ఇంటికొచ్చేవారు. మంగళవారం ఆటో లేకపోవడంతో భర్త రంగస్వామి ఆమెను మడకశిరలో వదిలిపెట్టేందుకు ద్విచక్రవాహనం వేసుకొచ్చారు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. విషయం తెలుసుకున్న కంపెనీ హెచ్‌ఆర్‌ సుజాత ఆసుపత్రిలో భార్యాభర్తల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంపెనీ తరపున మృతురాలికి వచ్చే రాయితీలను కుటుంబసభ్యులకు అందిస్తామని చెప్పారు. న్యాయవాది వైసీ గోవర్ధన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి గ్రామస్తులు సంతాపం తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top