ఆరిన ఆశాదీపాలు | Sakshi
Sakshi News home page

ఆరిన ఆశాదీపాలు

Published Wed, May 22 2019 7:47 AM

Close Friend Died In Road Accident Khammam - Sakshi

బూర్గంపాడు: రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాలలో విషాదం నెలకొంది. కుటుంబ ఆశాదీపాలు ఆరిపోవటంతో ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. బాగా చదువుకుని తమ కుటుంబాలకు ఆసరా అవుతారునుకున్న కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారనే సమాచారం ఆ కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది.  బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు విలపిస్తున్న తీరును చూసి అందరి కళ్లు చెమర్చాయి. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొని ఇరువురు యువకులు మృతిచెందిన ఘటన మంగళవారం బూర్గంపాడు మార్కెట్‌యార్డు వద్ద జరిగింది.

ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బూర్గంపాడులోని గౌతమీపురం కాలనీకి చెందిన బర్ల బిందుకుమార్‌ (21), గంగపురి సాయికిరణ్‌(18) మంగళవారం మధ్యాహ్నం బూర్గంపాడు మెయిన్‌సెంటర్‌ నుంచి గౌతమిపురానికి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటార్‌సైకిల్‌పై ఉన్న బర్ల బిందుకుమార్, గంగపురి సాయికిరణ్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

భద్రాచలం నుంచి వచ్చిన ఓ ఫ్రెండ్‌ ఫోన్‌ చేయటంతో వీరు మోటార్‌సైకిల్‌పై బూర్గంపాడు బస్టాండ్‌ సెంటర్‌కు వచ్చారు. అక్కడ కొద్దిసేపు స్నేహితుడితో మాట్లాడిన అనంతరం స్నేహితుడి బుల్లెట్‌ వాహ నం తీసుకుని గౌతమిపురం వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. రోడ్డుపక్కన మట్టి ఉండటంతో పాటు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమం లో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను వెంటనే బూర్గంపాడు సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యు లు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

మరణంలోను వీడని స్నేహం.. 
బర్ల బిందుకుమార్, గంగపురి సాయికిరణ్‌ కులా లు వేరైనా అన్నదమ్ముల్లా్ల కలిసి మెలిసి ఉంటారు. ఒకే కాలనీకి చెందిన వీరు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. పాల్వంచలో బీటెక్‌ చదువుతున్న బర్ల బిందుకుమార్‌ బాగా చదివి కుటుంబానికి ఆసరాగా ఉండాలని చెబుతుండేవాడు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ చదువుతున్న గంగపురి సాయికిరణ్‌  తమ తల్లిదండ్రులకు ఒక్కడే కొడు కు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని తల్లిదండ్రులు అతడిని కష్టపడి చదివిస్తున్నారు. ఇరువురి మరణం ఆ కుటుంబాలను తీవ్ర విషాదంలో నింపింది.

బర్ల వెంకటరత్నం, స్వరూపల రెండవ కుమారుడు బర్ల బిందుకుమార్‌. తాపీ పనులు, కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటరత్నం దంపతులు పిల్లలను చదివించేందుకు బాగా కష్టపడుతున్నారు. తమ ముగ్గురు పిల్లలు  ప్రవీణ్‌కుమార్, బిందుకుమార్, వేణుచంద్‌లను వారు కష్టపడి చదివిస్తున్నారు. బీటెక్‌ చదువుతున్న బిందుకుమార్‌ రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణణాతీతం.

అదేవిధంగా గౌతమిపురం కాలనీకి చెం దిన గంగపురి చిన్నవెంకటి, చంద్రకళ దంపతుల కుమారుడు సాయికిరణ్‌. తమ కుమార్తె రమాదేవికి వివాహం చేసిన చిన్నవెంకటి దంపతులు తమ ఆశలన్నీ సాయికిరణ్‌పై పెట్టుకున్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో చిన్నవెంకటి హమాలీగా పనిచేస్తున్నాడు. చంద్రకళ స్థానికంగా కూలీ పనులు చేస్తుంది. తమ ఆశలదీపం కొడుకు సాయికిరణ్‌ను కష్టపడి చదివిస్తున్నారు.  కొడుకు రోడ్డుప్రమాదంలో మరణించాడనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. సాయికిరణ్‌ మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరిని కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంక టప్పయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement