సెల్‌ చార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

సెల్‌ చార్జింగ్‌ పెడుతూ వ్యక్తి మృతి

Published Thu, Aug 23 2018 7:42 AM

Cell Phone Charging Man Death Nellore - Sakshi

రాపూరు (నెల్లూరు): సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతూ రాపూరు మండలంలోని గిలకపాడు ఎస్టీకాలనీకి చెందిన చలంచర్ల మణి(36) మంగళవారం రాత్రి మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు గిలకపాడు ఎస్టీకాలనీకి చెందిన చలంచర్ల మణి మంగళవారం రాత్రి తన సెల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టేందుకు చార్జర్‌ను తీసుకున్నాడు. చార్జర్‌ను విద్యుత్‌ బోర్డులో పెట్టి పిన్‌ను సెల్‌ఫోన్‌కు పెడుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై మణి కింద పడిపోయాడు. వెంటనే అతని భార్య చార్జర్‌ వైరును తొలగించి చుట్టుపక్కల వారిని పిలిచి మణిని రాపూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే మృతి చెందినట్టు స్థానికులు నిర్ధారించారు.

విషయం తెలిసిన వెంటనే రాపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సెల్‌ఫోన్‌ను, చార్జర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో గిలకపాడు ఎస్టీకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మణికి భార్య భవాని, పిల్లలు అఖిల్, సురేంద్ర ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement