ప్రయాణీకురాలి పర్సును కొట్టేసిన ఏఎస్సై

BSF ASI Arrested for Theft at Delhi Airport - Sakshi

ఢిల్లీ: అనుమానాస్పద వ్యక్తులపై నిత్యం నిఘాపెట్టాల్సిన ఖాకీయే దారితప్పాడు. ఎయిర్‌పోర్టులో ప్రయాణీకురాలి పర్సు దొంగిలించిన బీఎస్‌ఎఫ్‌ ఏఎస్సైని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో శ్రీనగర్‌ వెళ్లేందుకు విమానం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ తన సీటు కింద పర్సు పెట్టి కూర్చుం‍ది. అదే సమయంలో నిందితుడు నరేశ్‌ కుమార్‌ బాగ్‌డోగ్రా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే విమానం కోసం వేచి చూస్తూ, అదను చూసి పర్సును కొట్టేశాడు.

ఆ పర్సులో దాదాపు రూ.15 లక్షల విలువైన బంగారు,వజ్రాభరణాలు ఉన్నాయి. కొద్దిసేపటికి పర్సు పోయిందని గ్రహించిన సదరు మహిళ అక్కడున్న అలారం మోగించి పోలీసులను అప్రమత్తం చేసింది. పోలీసులు వచ్చి సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, బండారం బయటపడింది. వెంటనే పోలీసులు నరేశ్‌ని పట్టుకుని తమ కస్టడీలోకి తీసుకున్నారు. చోరీ సొమ్మును బాధిత మహిళకు అప్పగించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. విచారణలో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా చేశానని, తను వెళ్లాల్సిన విమానం వచ్చుంటే ఈ సొమ్ముతో బయటపడేవాణ్ణని తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top