
బెంగళూరు : పోలీసులు బందోబస్తు విధుల్లో తలమునకలై ఉండగా.. దొంగలు తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఒకే రోజు వేర్వేరు చోట్ల చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వివరాలు... దివంగత బీజేపీ క్రేంద మంత్రి అనంథ్ కుమార్ అంత్యక్రియల నిమిత్తం బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు మంగళవారం ఆయన నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహణలో మునిగిపోయారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో బెంగళూరు వెస్ట్ డివిజన్లోని రాజరాజేశ్వరినగర్, గిరినగర్ ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెల్లారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రతిఘటించిన మహిళలను నెట్టివేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దొంగలందరూ బైక్ల మీద వచ్చారని.. మొహం కనిపించకుండా కవర్ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసలు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చైన్ స్నాచర్స్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.