అత్తమామలు కొట్టారని.. | The aunt beats | Sakshi
Sakshi News home page

అత్తమామలు కొట్టారని..

Mar 19 2018 9:38 AM | Updated on Nov 6 2018 8:08 PM

The aunt beats - Sakshi

కారులో శ్రీనివాస రెడ్డి మృతదేహం

మేదరమెట్ల: అప్పు తీర్చాలని అడిగేందుకు వెళ్లిన అల్లుడిపై అత్తమామలు దాడి చేయడంతో తీవ్ర మనస్తాపం చెంది తన కారులోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మేదరమెట్లలో శనివారం రాత్రి జరగగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవ మండలం కూకట్లపల్లికి చెందిన గాదె శ్రీనివాసరెడ్డి (35)కి గతేడాది కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామానికి చెందిన పమ్మి అనంతారెడ్డి కుమార్తెతో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో మామకు అప్పుగా కొంత సొమ్ము శ్రీనివాసరెడ్డి ఇచ్చాడు.

రెండు రోజుల క్రితం శ్రీనివాసరెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగేందుకు అత్తగారింటికి వెళ్లాడు. అత్తమామలు కలిసి కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై మేదరమెట్ల పాత గుంటూరు రోడ్డులోని పుగాకు కంపెనీ వద్ద శనివారం రాత్రి (తన కారులోనే) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం కారులో మృతుని గుర్తించిన స్థానికులు మేదరమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వై.పాండురంగారావు తన సిబ్బందితో వచ్చి కారు తాళాలు పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు.

మృతుడి జేబులో తనకు రావాల్సిన బకాయిల వివరాలతో పాటు అతడు ఇవ్వాల్సిన అప్పుల వివరాలను రాసి ఉం చాడు. తనను అత్తమామలు కొట్టడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ లేఖలో రాసి ఉంది. మృతదేహాన్ని సీఐ హైమారావు పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి భద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement