ముంబై రైల్వే ట్రాక్‌లపై 3వేల మంది మృతి | 3000 commuters killed on Mumbai railway tracks | Sakshi
Sakshi News home page

ముంబై రైల్వే ట్రాక్‌లపై 3వేల మంది మృతి

Jan 26 2018 5:16 PM | Updated on Apr 3 2019 8:52 PM

ముంబై: ముంబై మెట్రోపాలిటన్‌ సిటీలోని సబ్‌-అర్బన్ సహా వివిధ రైలు మార్గాల్లో 2017 సంవత్సరంలో జరిగిన ప్రమాదాల్లో మూడువేలమందిపైగా ప్రయాణికులు మృతిచెందినట్లు రైల్వే శాఖ తెలిపింది. పశ్చిమ, సెంట్రల్‌, హార్బర్‌, సబ్‌ అర్బన్‌ మార్గాల్లో వీరు చనిపోయినట్లు నగరానికి చెందిన సమాచార కార్యకర్త సమీర్‌ జవేరి దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రభుత్వ రైల్వే పోలీసులు సమాధానమిచ్చారు. 1651మంది పట్టాలు దాటుతూ రైళ్లు ఢీకొని మృతిచెందారని, 654మంది నడుస్తున్న రైళ్ల నుంచి జారిపడి మృతిచెందారని పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం, రైళ్ల నుంచి జారి పడడం, రైళ్లు ఢీకొని మృతిచెందడం వంటి మూడు కారణాలతో ఇంతమంది చనిపోతున్నారని, వీటిలో ఆత్మహత్యలను నివారించలేమని, మిగతా రెండింటిని నిరోధించగలమని సెంట్రల్‌ రైల్వే జీఆర్‌పి ఏసీపీ మచ్చీంద్ర చవాన్‌ చెప్పారు.

అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజి మహరాజ్‌ టెర్మినస్(సీఎస్‌ఎంటీ)‌, దాదర్‌, బైకుల్లా స్టేషన్లు ఉన్న సెంట్రల్‌ లైన్‌లో1534మంది చనిపోయారని తెలిపారు. కాగా, వెస్టర్న్‌ లైన్‌లో 1540మంది గాయపడ్డారని, 1435మంది సెంట్రల్‌ లైన్‌లో, 370మంది హార్బర్‌ లైన్‌లో గాయపడ్డారని ఆ నివేదిక పేర్కొంది. ఈ విధంగా రోజుకు 9మంది చనిపోతున్నారని, దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వివిధ ప్రదేశాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని ఏసీపీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement