షావోమి నెక్ట్స్‌ ప్లాన్స్‌ ఏంటంటే..

Xiaomi looking to invest $1 billion in Indian startups - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌  బ్రాండ్‌ షావోమి మేకర్‌,  చైనా  దిగ్గజం షావోమి  ఇండియాలో పెట్టుబడులపై  దృష్టిపెట్టింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో రాకెట్‌లా దూసుకుపోతున్న  షావోమి  100 స్టార్ట్‌అప్‌లు: 100కోట్ల డాలర్ల పెట్టుబడులంటూ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే అయిదు సంవ్సరాల్లో స్టార్ట్‌అప్‌ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తోంది. ముఖ‍్యంగా  మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వాడకాన్ని బాగా విస్తరించే కంపెనీల్లో ఈ పెట్టుబడులను పెట్టనుంది. తద్వారా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకోవాలని  యోచిస్తోంది. అంతేకాదు శాంసంగ్‌, వివో, ఒప్పో లాంటి  ప్రత్యర్థులకు షాక్‌ ఇవ్వనుంది.  వీటి కంటే భిన్నమైన, మెరుగైన ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌, ఇతర సేవలను అందిస్తూ స్టార్ట్‌ఫోన్‌ యూజర్లను ఆకర్షించనుంది.

స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలో ఎకో సిస్టంను సృష్టించేందుకు  దాదాపు 100 కంపెనీల్లో బిలియన్‌ డాలర్ల (100కోట్ల డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నామని కంపెనీ ప్రకటించింది చైనాలో, గత నాలుగు సంవత్సరాలలో తాము 300 కంపెనీల్లో 4 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టామని.. ఈ నేపథ్యంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో భారత్‌లో  100 కంపెనీల్లో  ఈ పెట్టుబడులు పెట్టబోతున్నామని  షావోమి చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జూన్‌ వెల్లడించారు. చైనాలో బాగా విజయవంతమైన ఎకోసిస్టం నమూనాను భారత్‌లో ప్రతిబింబించనున్నామన్నారు. కొన్నికీలకమైన అంశాల్లో మాత్రమే తాము దృష్టిపెట్టి, మిగతావాటిని భాగస్వాములకు విడిచిపెట్టడం షావోమి బిజినెస్‌ మోడల్‌ అని లీ  చెప్పుకొచ్చారు.   ముఖ్యంగా మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వాడకాన్ని  ప్రోత్సహించే  కంపెనీలపై తాము ఆసక్తిగా ఉన్నామని చెప్పారు.  అవి మొబైల్ ఇంటర్నెట్  బిజినెస్‌తో సంబంధం ఉన్నంత కాలం ఆయా కంపెనీల్లో మైనారిటీ వాటాలను కొనుగోలు  చేస్తామని లీ చెప్పారు
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top