స్టాక్స్‌ వ్యూ | stock view :which one best | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Jun 25 2018 2:33 AM | Updated on Oct 2 2018 5:51 PM

stock view :which one best - Sakshi

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.1,197     టార్గెట్‌ ధర: రూ.1,600 

ఎందుకంటే: భారత్‌లో మూడో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇది. కంపెనీ నిర్వహణ ఆస్తులు రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం కల్లా 25 శాతానికి పైగా చక్రగతిన రుణ వృద్ధి సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ అనుసరిస్తున్న రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలు, డిజిటైజేషన్‌ను వినియోగించుకుంటున్న తీరు, ఉత్పాదకత మెరుగుదల తదితర అంశాల కారణంగా ఈ లక్ష్యాలను కంపెనీ సాధించగలదని విశ్వసిస్తున్నాం.  అందుబాటు ధరల గృహరంగానికి డిమాండ్‌ బాగా పెరుగుతుండటంతో నిర్వహణ ఆస్తులు 2022–23 ఆర్థిక సంవత్సరం కల్లా రూ.4 లక్షల కోట్లకు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు సమస్యలతో సతమతం అవుతుండటంతో ఆస్తులు తనఖాగా ఇచ్చే రుణాల(ఎల్‌ఏపీ)కు డిమాండ్‌ బాగా ఉండగలదని కంపెనీ భావిస్తోంది. రెరా అమలు కారణంగా కన్‌స్ట్రక్షన్‌ ఫైనాన్స్‌ కూడా జోరందుకోగలుగుతుందని అంచనా. విదేశీ వాణిజ్య రుణ(ఈసీబీ) నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించడం కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశమే. ఇప్పటివరకూ టాప్‌ 20 నగరాలపైనే దృష్టి పెట్టిన ఈ కంపెనీ చిన్న నగరాలు, పట్టణాల్లో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్‌ సిటీ హోమ్‌ లోన్‌లు, ఈ–హోమ్‌ లోన్‌లకు ప్రాధాన్యత ఇస్తోంది. రాబడి నిష్పత్తులు ఉత్తమమైన స్థాయిలోనే ఉన్నాయి. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 30 శాతానికి పైగా, రిటర్న్‌ ఆన్‌ అసెట్‌(ఆర్‌ఓఏ) 2.8 శాతనానికి పైగా ఉన్నాయి. గృహ రుణాలకు డిమాండ్‌ పెరుగుతుండటం, కంపెనీ ట్రాక్‌ రికార్డ్‌ బలంగా ఉండటం...  సానుకూలాంశాలు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మందగమనం ఏర్పడితే, అది ఈ కంపెనీపై తీవ్రమైన ప్రభావమే చూపించవచ్చు. డిఫాల్ట్‌లు పెరగడం, రిస్క్‌ వెయిటేజ్‌ పెంచడం, రీ ఫైనాన్స్‌ విషయంలో వడ్డీరేట్లపై పరిమితి వంటి అంశాలపై నియంత్రణ సంస్థలు నిబంధనలు కఠినతరం చేయడం.. ఇవి ప్రతికూలాంశాలు.

మారుతీ సుజుకీ
కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ 
ప్రస్తుత ధర: రూ.8,890     టార్గెట్‌ ధర: రూ.10,525 

ఎందుకంటే: అంచనాలను మించిన అమ్మకాలు సాధించినా  ఈ ఏడాది ఈ షేర్‌ పెద్దగా పెరగలేదు. ఇంధన ధరలు అధికంగా పెరగడం, జపాన్‌ కరెన్సీ యెన్‌ బలపడటం, మాతృకంపెనీ సుజుకీ. టయోటాతో భాగస్వామ్యం విషయంలో పురోగతి పెద్దగా లేకపోవడం తదితర అంశాలు దీనికి కొన్ని కారణాలు. అయితే గతంలో ఇంధన ధరలు పెరిగినా, వాహన విక్రయాలు తగ్గిన దాఖలాలు లేవు. ఇంధన ధరలు పెరిగినా డిమాండ్‌పై పెద్దగా ప్రభావం లేదని డీలర్లంటున్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ఈ కంపెనీ అధిక సంఖ్యలో అందిస్తోంది. సీఎన్‌జీతో నడిచే ఆరు మోడళ్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఈ వాహనాలకు డిస్కౌంట్లు ఇవ్వనవసరం లేదు. పైగా ధరల నిర్ణయంలో కంపెనీకి స్వేచ్ఛ ఉంటుంది. కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. అయితే వ్యయ నియంత్రణ పద్ధతులతో పాటు వాహనాల ధరలను పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలమని కంపెనీ ధీమాగా ఉంది.  టొయోటాతో మారుతీ సుజుకీ మాతృకంపెనీ సుజుకీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫలితంగా టయోటా ఎలక్ట్రానిక్‌ వాహన టెక్నాలజీ మారుతీకి అందనున్నది. వివిధ రకాల వాహనాలను అందుబాటులోకి తేవడం, డిస్కౌంట్లు తగ్గించడం, మాతృకంపెనీ సుజుకీకి చెల్లించాల్సిన రాయల్టీ తగ్గనుండటం, గుజరాత్‌ ప్లాంట్‌ పునర్వ్యవస్థీకరణ తదితర అంశాల కారణంగా కంపెనీ నిర్వహణ లాభ మార్జిన్‌ 2 శాతం పెరిగి 14 శాతానికి చేరగలదని అంచనా. అమ్మకాలు అంతకంతకూ పెరుగుతుండటం, మార్జిన్లు అధికంగా ఉండటం, మార్జిన్లు అధికంగా ఉండే ప్రీమియమ్‌ మోడళ్లను పెంచుతుండటం, జపాన్‌ కరెన్సీ యెన్‌ ప్రభావం తగ్గే అవకాశాలు, మార్కెట్‌ వాటా పెరుగుతుండటం, ...ఇవన్నీ సానుకూలాంశాలు. ఏడాది కాలంలో ఈ షేర్‌ రూ.10,525కు చేరుతుందని అంచనా వేస్తున్నాం.

గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. 

Advertisement
 
Advertisement
Advertisement