
దేశీయ స్టాక్మార్కెట్ మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 400 పాయింట్లు ఆర్జించి 37819 వద్ద మొదలైంది. నిఫ్టీ 109 పాయింట్లు పెరిగి 11100పైన 11131 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాధికి సంబంధించి ఆయా కంపెనీలు రూపొందించిన 3 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగించడంతో మార్కెట్ వర్గాలకు ఉత్సాహానిచ్చింది. అలాగే ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు సెంటిమెంట్ను బలపరిచాయి.
అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్ రంగ ర్యాలీతో ఎన్ఎస్ఈలో కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1.61శాతం లాభంతో 22,680 వద్ద ట్రేడ్ అవుతోంది.
టెక్నాలజీ రంగషేర్ల ర్యాలీతో పాటు కోవిడ్-19 వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను ఇస్తుండటంతో సోమవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం సానుకూలంగా కదులుతున్నాయి.
హిందూస్థాన్ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, క్రిసెల్, ఇండియా మార్ట్, ఇంటర్మెస్, పాలీక్యాబ్, ఎస్బీఐ లైఫ్తో పాటు సుమారు 60 కంపెనీలు నేడు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించునున్నాయి. అలాగే స్టాక్- ఆధారిత ట్రేడింగ్, కోవిద్-19 సంబంధిత అంశాలు, అంతర్జాతీయ పరిణామాలు నేడు మార్కెట్ గమనానికి దిశానిర్దేశం కానున్నాయి.
పవర్గ్రిడ్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీపోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో షేర్లు 2శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. కోల్ఇండియా, జీ లిమిటెడ్, ఎంఅండ్ఎం, ఇన్ఫ్రాటెల్, బజాజ్ఫిన్సర్వీసెస్ షేర్లు 0.10శాతం నుంచి 1శాతం నష్టాన్ని చవిచూశాయి.