సెన్సెక్స్‌ 396 పాయింట్లు అప్‌

Sensex 396 PTS Higher - Sakshi

సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు

తగ్గిన చమురు

ధరలు 396 పాయింట్ల లాభంతో 38,990కు సెన్సెక్స్‌

131 పాయింట్ల  పెరిగి 11,571కు నిఫ్టీ 

బ్యాంక్, వాహన, ఇంధన షేర్ల దన్నుతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అంచనాల కంటే ముందుగానే చైనాతో వాణిజ్య ఒప్పందం కుదరగలదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొనడం, ముడి చమురు ధరలు దిగిరావడం సానుకూలప్రభావం చూపించాయి. సెప్టెంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. 2 రోజుల నష్టాల అనంతరం సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,000 పాయింట్లపైకి, నిఫ్టీ 11,600 పాయింట్లపైకి ఎగబాకినా, చివరకు ఆ రెండు సూచీలు ఆ స్థాయిల్లో నిలదొక్కుకోలేకపోయాయి. ఇంట్రాడేలో 564 పాయింట్ల వరకూ పెరిగిన సెన్సెక్స్‌ చివరకు 396 పాయింట్ల లాభంతో 38,990 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 11,571 పాయింట్ల వద్దకు చేరింది.  రూపాయి  విలువ 8 పైసలు పుంజుకొని 70.95కు చేరడం కలసివచ్చింది.  

మరిన్ని ఉద్దీపన చర్యల అంచనాలు..!
ఉద్దీపన చర్యలు, పండుగ సీజన్‌లో డిమాండ్‌ అంచనాలతో వాహన, బ్యాంక్, లోహ షేర్లు పెరిగాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. 
ఆల్‌టైమ్‌ హైకి ఐసీఐసీఐ బ్యాంక్‌ 
ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.458ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.452 వద్ద ముగిసింది.
1.57 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
ఇన్వెస్టర్ల సంపద రూ.1.57 లక్షల కోట్లు పెరిగింది.  బీఎస్‌ఈలో లిస్టైన  కంపెనీల మార్కెట్‌ క్యాప్‌  రూ.1,48,45,855 కోట్లకు ఎగసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top