టెక్స్టైల్స్ కోసం రిలయన్స్ జేవీ
ప్రైవేట్ రంగ చమురు దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) టెక్స్టైల్స్ రంగంపై దృష్టిపెట్టింది.
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ చమురు దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా టెక్స్టైల్స్ రంగంపై దృష్టిపెట్టింది. తద్వారా దేశీ కార్యకలాపాలను పటిష్టపరచుకోవడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా చైనా దిగ్గజం షాన్డాంగ్ రూయీ గ్రూప్తో చేతులు కలిపింది. మూడు బిలియన్ డాలర్ల విలువైన షాన్డాంగ్ గ్రూప్తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనుంది. ఈ జేవీలో ఆర్ఐఎల్కు 51%, షాన్డాంగ్కు 49% చొప్పున వాటా ఉంటుంది.
విమల్ బ్రాండ్ను పటిష్టం చేయడంతోపాటు ఈ జేవీ ద్వారా ఆర్ఐఎల్ కొన్ని గ్లోబల్ బ్రాండ్లను దేశీయంగా పరిచయం చేయనుంది. షాన్డాంగ్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆర్ఐఎల్ ప్రస్తుత టెక్స్టైల్ బిజినెస్ను జేవీకి బదిలీ చేయనుంది. ఇందుకు కొంతమేర నగదును పొందనుంది. కాగా, అంతర్జాతీయ రుణ మార్కెట్లలో పదేళ్ల కాలపరిమితిగల డాలర్ వర్గీకరణ బాండ్లను ఆర్ఐఎల్ అమ్మకానికిపెట్టింది. తద్వారా 100 కోట్ల డాలర్లను(రూ. 6,200 కోట్లు) సమీకరించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


