ఆర్‌బీఐ నిధులపై కన్ను!?

RBI is not a limited company: Former finance minister P Chidambaram - Sakshi

రూ.లక్ష కోట్లను డిమాండ్‌ చేస్తున్న ప్రభుత్వం

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపణ

వీటిని ఖండించిన కేంద్రం

అటువంటి ప్రతిపాదన లేదు

నిధుల నిల్వల నిర్వహణపైనే చర్చలు

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గార్గ్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వద్దనున్న భారీ నిధులపై కేంద్రం కన్నేసిందా? వాటిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని భావిస్తోందా..? నిజం ఇప్పటికైతే వాస్తవ రూపం దాల్చలేదు కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం దీనిపై ఆరోపణలకు దిగింది. మోదీ సర్కారు ద్రవ్యలోటు సంక్షోభం గట్టెక్కేందుకు ఆర్‌బీఐ నిధులను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ‘‘ప్రభుత్వం ద్రవ్యలోటు సంక్షోభంలో ఉంది. ఎన్నికల సంవత్సరంలో వ్యయాలను పెంచాలనుకుంటోంది. ఇందుకోసం ఆర్‌బీఐ నుంచి రూ.లక్ష కోట్లను డిమాండ్‌ చేస్తోం ది’’ అని చిదంబరం అన్నారు. ఒకవేళ ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తన విధానానికే కట్టుబడితే, ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 కింద రూ.లక్ష కోట్లను బదిలీ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలనుకుంటున్నట్టు చిదంబరం ఆరోపించారు. 

ఆ ప్రతిపాదన లేదు
ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్‌ ట్విట్టర్లో స్పందిస్తూ... ప్రభుత్వం అంత తీవ్ర నిధుల అవసరాల్లో లేదని, రూ.3.6 లక్షల కోట్లను బదిలీ చేయాలంటూ ఆర్‌బీఐని కోరే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యం 3.1 శాతాన్ని చేరుకునే క్రమంలోనే ప్రభుత్వం ఉందన్నారు. ‘‘2013–14లో ప్రభుత్వ ద్రవ్యలోటు 5.1 శాతంగా ఉంది. 2014–15 తర్వాత నుంచి ఈ లోటును గణనీయంగా తగ్గించడంలో ప్రభుత్వం సఫలం అయింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.3 శాతానికి ద్రవ్యలోటును కట్టడి చేయగలం. బడ్జెట్‌లో పేర్కొన్న రుణ సమీకరణ లక్ష్యం రూ.70,000 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే సాధించింది. ఆర్‌బీఐకి సంబంధించి సరైన ‘ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌’పైనే చర్చ నడుస్తోంది’’ అని సుభాష్‌చంద్ర గార్గ్‌ తెలిపారు. అన్ని రకాల రిస్క్‌లను ఎదుర్కొనేందుకు వీలుగా తగినన్ని నగదు నిల్వలను కలిగి ఉండడాన్ని ‘ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌’గా చెబుతారు. 2016–17 ఆర్థిక సర్వే సందర్భంగా నాటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం... ఆర్‌బీఐ వద్ద భారీ స్థాయిలో నిధులు ఉన్నాయని, వాటిల్లో రూ. 4 లక్షల కోట్ల మేర ప్రభుత్వానికి బదిలీ చేస్తే వాటిని బ్యాంకుల రిక్యాపిటలైజేషన్‌కు వినియోగించొచ్చని పేర్కొనడం గమనార్హం. దీనిపై అప్పట్లో వివాదమేదీ రాలేదు. తాజాగా చిదంబరం ఆరోపణలతో కలకలం నెలకొంది. 

కార్యాచరణ వెనుక...?
అయితే, ఆర్‌బీఐ కనీస నగదు నిల్వలపై చర్చిస్తున్నట్టు కేంద్రం ప్రకటించగా, దీనిలో అంతరార్థం పరిశీలిస్తే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా ఆర్‌బీఐ కనీస నగదు నిల్వల కార్యాచరణ పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్టు ఒక అధికారి పేర్కొనడం గమనార్హం. ‘‘ప్రస్తుతం ఆర్‌బీఐ క్యాపిటల్‌ 27 శాతాన్ని ప్రొవిజనింగ్‌కు కేటాయించాల్సి ఉంది. అతర్జాతీయంగా చాలా సెంట్రల్‌ బ్యాంకుల్లో ఇది 14 శాతమే. మా లెక్కల ప్రకారం ఆర్‌బీఐ ప్రొవిజన్లు 14 శాతంగా ఉంటే, రూ.3.6 లక్షల కోట్ల నిధులకు స్వేచ్ఛ లభిస్తుంది’’ అని ఆ అధికారి వివరించారు. ఈ నిధులను ఆర్‌బీఐ వద్ద ఖాళీగా ఉంచడం కంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించొచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ అంశం నవంబర్‌ 19న జరిగే ఆర్‌బీఐ తదుపరి భేటీలో చర్చకు వస్తుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య పలు అంశాల్లో విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ, ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.54,817 కోట్ల డివిడెండ్‌ ఆదాయం రావొచ్చన్న అంచనాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. దీనికి అనుగుణంగానే ఆర్‌బీఐ రూ.50,000 కోట్లను కేంద్రానికి డివిడెండ్‌ ఇవ్వాలని ఈ ఏడాది ఆరంభంలో నిర్ణయించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top