దాస్‌.. ‘డబుల్‌’ ధమాకా!

RBI cuts repo rate by 25 basis points - Sakshi

వరుసగా రెండోసారీ రెపో రేటు తగ్గింపు...

పావుశాతం కోత; 6.25 శాతం నుంచి 6 శాతానికి డౌన్‌

ఆర్థిక వ్యవస్థకు ఊతమే లక్ష్యం

గృహ, వాహన, వాణిజ్య రుణాలపై తగ్గనున్న ఈఎంఐల భారం

వృద్ధి అంచనాలకు ‘పాలసీ కోత’

7.4 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింపు

ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు

ముంబై: మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో 2వ తేదీ నుంచీ ఎంపీసీ ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం కీలక నిర్ణయాలు మూడవరోజు– గురువారం వెలువడ్డాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకూ) ఇది తొలి ద్వైమాసిక సమావేశం. రెండు నెలల క్రితం జరిగిన  ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్‌బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్‌బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్‌ అయినట్లయ్యింది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ మరో వారంలో ఉండగా ఆర్‌బీఐ తాజా కీలక నిర్ణయం తీసుకుంది.

కాగా, రివర్స్‌ రెపో రేటును కూడా ఆర్‌బీఐ పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి సర్దుబాటు అయ్యింది.  బ్యాంకులు తమ వద్ద మిగులు నిధులు ఉంటే, వాటిని ఆర్‌బీఐ వద్ద ఉంచి వడ్డీ పొందుతాయి.   ఈ రేటునే రివర్స్‌ రెపోగా పేర్కొంటారు. ఈ రేటు ఎక్కువగా ఉంటే, తద్వారానే అధిక ప్రయోజనం పొందడానికి బ్యాంకులు మొగ్గుచూపుతాయి. వ్యవస్థలో రుణ లభ్యత,  లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగాలంటున్న ఆర్‌బీఐ, రివర్స్‌రెపో రేటును కూడా తగ్గించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరంలో రెండవ ద్వైమాసిక సమావేశం జూన్‌ 3 నుంచి 6వ తేదీ వరకూ జరుగుతుంది.

ఫలితాలు ఎలా ఉంటాయంటే?
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. దీనిని తగ్గిస్తే, బ్యాంకులకు నిధుల సమీకరణ భారం తగ్గుతుంది. ఇలా తమకు లభించే వడ్డీరేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్‌ కస్టమర్లకు బదలాయిస్తే,  గృహ, రుణ, వాహన రుణాలపై కస్టమర్ల నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) తగ్గుతాయి. అయితే తమకు లభించిన రేటు ప్రయోజనాన్ని యథాతథంగా బ్యాంకింగ్‌ కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శ అన్ని వర్గాల నుంచీ వ్యక్తమవుతుంది. ఆర్‌బీఐ తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తగ్గించిన రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందేలా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఫిబ్రవరిలో పావుశాతం రేటు తగ్గిస్తే, కొన్ని బ్యాంకులు తమ ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేట్స్‌) కేవలం 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్లే తగ్గించిన విషయాన్ని గుర్తుచేసింది. మరింత రేటు కోత అవసరాన్ని స్పష్టంచేసింది. కాగా రెపో రేటు, బాండ్‌ ఈల్డ్స్‌ వంటి బెంచ్‌మార్క్‌ రేట్లతో వ్యక్తిగత, గృహ, ఆటో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాల అనుసంధానంపై బ్యాంకులతో ఆర్‌బీఐ మరిన్ని చర్చలు జరుపుతుందని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. దీనితో ఇందుకు సంబంధించి తుది మార్గదర్శకాల జారీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.  

యథాతథమే బెటరన్న ఇరువురు
కాగా రేటు కోత నిర్ణయం ఏకాభిప్రాయ ప్రాతిపదికన జరగలేదు. ఇరువురు సభ్యులు ఇందుకు ‘నో’ అన్నారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య, ఎంసీసీ సభ్యుడు ఛేతన్‌ ఘాటే ఇందులో ఉన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌తో పాటు పామీదువా, రవీంద్ర దోలాకియా, మైఖేల్‌పాత్రలు రేటుకోతకు సానుకూలంగా ఓటు వేశారు.  ఇక ద్రవ్య వ్యవస్థకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరిపై ఆరుగురిలో ఐదుగురు ప్రస్తుతం ఉన్న ‘న్యూట్రల్‌’ (తటస్థం)ను కొనసాగించాలని పేర్కొంటే, రవీంద్ర డోలాకియా మాత్రం ‘అకామిడేటివ్‌’  (సర్దుబాటుకు అనువైన) విధానాన్ని అనుసరించడానికి ఓటు చేశారు. దీనితో తటస్థం విధానాన్నే ఆర్‌బీఐ ఎంచుకున్నట్లయ్యింది.  

ధరా‘భయం’ ఉపశమనం...
ద్రవ్యోల్బణం రేటు అంచనాలను మాత్రం ఆర్‌బీఐ తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 2.9–3 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరిలో ఈ అంచనాలను 3.2–3.4 శ్రేణిగా ఆర్‌బీఐ పేర్కొంది. కాగా ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో 3.5–3.8% వరకూ ఉంటుందని అంచనావేసింది.  అంటే ఆర్‌బీఐ లక్ష్యం 4% దిగువనే ద్రవ్యోల్బణం ఉంటుందన్నమాట. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.57 శాతం. కాగా ఆహార, ఇంధన ధరలు తీవ్రంగా పెరిగితే మాత్రం మొత్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్‌బీఐ పేర్కొంది.  

వృద్ధి, ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా...
‘తాజా నిర్ణయానికి ప్రధానంగా రెండు అంశాలు కారణం. ఒకటి వృద్ధిరేటు మందగమనంలో ఉండడం. రెండవది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం. ధరల స్పీడ్‌ తక్కువగా ఉన్నందువల్ల వృద్ధి లక్ష్యంగా రేటు కోతకు తగిన సమయమని భావించడం జరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లో ఎగుమతుల వృద్ధి బలహీనంగా ఉంది. దిగుమతులు విషయానికి వస్తే, చమురు యేతర దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులూ తగ్గాయి. దేశంలో వృద్ధి మందగమన పరిస్థితులను ఇది సూచిస్తోంది. ఇక  ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) అవరోధాలు లేకుండా చూస్తాం’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ ఎదురీత...
దేశీయ ఆర్థిక వ్యవస్థ ఎదురీదుతోందని విధాన ప్రకటన తెలిపింది. ప్రత్యేకించి అంతర్జాతీయ రంగంలో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరిలో ఈ రేటును 7.4 శాతంగా అంచనా వేసింది. అంటే 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టిందన్నమాట.  డిసెంబర్‌ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)వృద్ధి రేటు 6.6 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు పెట్టుబడుల్లో బలహీనత దీనికి కారణం. బలహీనంగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇవ్వడం ద్వారా దేశీయ వృద్ధి రేటును పటిష్ట పరచుకోవాల్సి ఉందని ప్రకటన పేర్కొంది. ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటుందని సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనా వేయగా, రెండవ అర్ధభాగంలో 7.3 శాతం నుంచి 7.4 శాతం మధ్య ఉంటుందని భావించింది.

సుప్రీం తీర్పు వ్యతిరేకం కాదు...
మొండిబకాయిలకు సంబంధించి 2018 ఫిబ్రవరి 12 ఆర్‌బీఐ సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిందంటే.. దానర్థం, ఆర్‌బీఐ అధికారాలను తీసుకుందని కాదు. ఇందుకు సంబంధించిన అధికారాలను ఎలా వినియోగించాలన్నది సుప్రీంకోర్టు సూచించింది. అందువల్ల ఎన్‌పీఏ పునర్‌వ్యవస్థీకరణ, పరిష్కార ప్రణాళికలకు సంబంధించి త్వరలో ఆర్‌బీఐ సవరిత మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఎన్‌పీఏల సత్వర పరిష్కారానికి ఆర్‌బీఐ కట్టుబడి ఉంది. బ్యాంకింగ్‌ స్థిరత్వానికి ఇది ఎంతో అవసరం. మొత్త ఫైనాన్షియల్‌ రంగంలో పరిస్థితులకు అనుసంధానమైన అంశం ఇది.

ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న ఒక సంస్థ సహా (కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌) విద్యుత్‌ కంపెనీలు ఆర్‌బీఐని కోర్టుకు లాగడం ఆందోళనకరమన్న విశ్లేషణలు సరికాదు. ఏ సంస్థ నిర్ణయాన్నైనా చట్టం ముందు సవాలు చేయడం ఒక రాజ్యాంగ హక్కు. ఐఎల్‌ ఎఫ్‌ఎస్‌ రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటించవద్దని ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన రూలింగ్‌ విషయానికి వస్తే, దీనిని సవరించవలసిందిగా ఆర్‌బీఐ ఇప్పటికే ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. ఇక గణాంకాల విషయానికి వస్తే, అధికారికంగా అందిన డేటాకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, తమ పాలసీలపై స్పందనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. కార్పొరేట్‌ రుణాలకు సెకండరీ మార్కెట్‌ అభివృద్ధిపై కార్యాచరణ బృందం ఏర్పాటు చేయడం జరుగుతుంది.  
– శక్తికాంత్‌ దాస్, ఆర్‌బీఐ గవర్నర్‌  

రేట్ల తగ్గింపును బ్యాంకులు బదలాయిస్తే మంచిదే: పరిశ్రమలు
పారిశ్రామిక వర్గాలు రేటు తగ్గింపును స్వాగతించాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చే అంశంగా పేర్కొన్నాయి. వినియోగ వ్యయాలు పెరుగుతాయని విశ్లేషించాయి. అయితే తాజా రేటు కోత ప్రయోజనాలన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయిస్తేనే ఇది సాధ్యమని పేర్కొన్నాయి. ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమానీ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం రేటు కోతకు దోహదపడిందన్నారు. రేటు మరికొంత తగ్గింపునకూ అవకాశం ఉందని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ తల్వార్‌ అభిప్రాయపడ్డారు. వృద్ధి పటిష్టతపై ఆర్‌బీఐ పాలసీ దృష్టి సారించిందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. అయితే రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి బ్యాంకింగ్‌ తగిన చర్యలు తీసుకోవాలని వీరు అభిప్రాయపడటం గమనార్హం.

బ్యాంకుల నుంచి స్పందన నిల్‌...
ఆర్‌బీఐ వరుసగా రెండవదఫా రేటుకోత నిర్ణయం తీసుకున్నా...  ఈ ప్రయోజనాన్ని తక్షణం కస్టమర్లకు బదలాయించడంపై బ్యాంకుల నుంచి తగిన స్పందన రాలేదు. పాలసీ బాగుందని పేర్కొన్నా, తమ నుంచి రేటు కోతపై ఏ బ్యాంక్‌ నుంచీ తక్షణం ఎటువంటి స్పష్టమైన ప్రకటనలు వెలువడలేదు.

సంక్లిష్టతలు ఉన్నాయ్‌
జీడీపీ రేటు అంచనా తగ్గింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందన్న అంచనాలు ఉన్నా, తగిన వర్షపాతం లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. లిక్విడిటీ లభ్యతలకు చర్యలు బాగున్నాయి. ముందుచూపుతో రూపొందించిన ద్రవ్య విధానమిది. మార్కెట్‌ భాగస్వాముల డిమాండ్‌ను నెరవేర్చుతుంది.  

– రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చీఫ్‌

బ్యాంకింగ్‌కు సానుకూలం
రేటు తగ్గింపు, లిక్విడిటీ అందుబాటులో ఉంచడానికి తగిన చర్యలు బ్యాంకర్లకు సానుకూలం. అలాగే రేటు తగ్గింపు ప్రయోజనం సత్వర బదలాయింపునకూ ఈ నిర్ణయం దోహదపడుతుంది. రేటు కోత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ధరలు అదుపులో ఉంటాయన్న అంచనాలు సానుకూలం.  

– సునిల్‌ మెహతా, ఐబీఏ చైర్మన్‌

భయపడాల్సింది ఏదీలేదు
ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను తగ్గించినంత మాత్రాన భయపడాల్సింది ఏమీలేదు. వృద్ధికి సంబంధించి రానున్న కాలంలో ఆశాజనకమైన పలు అంశాలు ఉన్నాయి. బడా కార్పొరేట్‌ కంపెనీలకు రుణ వృద్ధి అంతకంతకూ పెరుగుతుండడం ఇందులో ఒకటి.

– కృష్ణమూర్తి సుబ్రమణ్యం, ప్రధాన ఆర్థిక సలహాదారు

ఆర్‌బీఐ రిజర్వ్స్‌పై త్వరలో జలాన్‌ నివేదిక
రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద నిల్వలు ఏ స్థాయిలో ఉండాలన్న అంశంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ త్వరలో తన నివేదికను సమర్పిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. కమిటీ ప్రస్తుతం ముమ్మర చర్చల్లో ఉందన్నారు. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. భారీ ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ఆర్‌బీఐ నిధుల్లో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top