అప్పగింతలప్పుడు ఏడ్చేశాను : ఇషా అంబానీ

Isha Ambani Reveals She Cried During Her Bidaai - Sakshi

ముంబై : దేశంలోనే అత్యంత వైభవంగా జరిగిన వివాహ వేడుకగా నిలిచింది ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం. ఓ నెల రోజుల పాటు మీడియాలో వీరి పెళ్లి ముచ్చట్లే. ఇషా అంబానీ - ఆనంద్‌ పిరమాల్‌ల వివాహం జరిగి ఇప్పటికి రెండు నెలలవుతుంది. ఈ మధ్యే ఓ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తన పెళ్లి వేడుక గురించి, అప్పగింతల కార్యక్రమం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఇషా.

ఇషా మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలో ప్రతి ఒక్కరితో నాకు గాఢమైన అనుబంధం ఉంది. ప్రతి ఒక్కరు నన్ను ఎంతో ప్రేమిస్తారు. పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచే అందరి కళ్లల్లో ఓ బాధ. అన్ని రోజులు నేను బాగానే ఉన్నాను. కానీ అప్పగింతలప్పుడు అందరూ ఏడుస్తున్నారు. ముఖ్యంగా మా అమ్మనాన్న ఏడవడం చూసి నాకు చాలా ఏడుపొచ్చింది. ఆ సమయంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చారు ఇషా. అంతేకాక ‘అందరి తల్లిదండ్రుల్లానే మా అమ్మనాన్న దగ్గరుండి నా పెళ్లి పనులన్ని చూసుకున్నారు. నేను ఊహించినదానికంటే ఎంతో అద్భుతంగా నా పెళ్లి చేశార’ని తెలిపారు ఇషా అంబానీ.

గతేడాది డిసెంబరు 12న ఇషా అంబానీ- పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో జరిగిన వివాహ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ సహా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top