భారత్‌ : అంచనాలకు కోత అయినా టాప్‌లోనే.. | IMF Lowers India Growth Projection, But It Still Retains World Top Spot | Sakshi
Sakshi News home page

భారత్‌ : అంచనాలకు కోత అయినా టాప్‌లోనే..

Jul 17 2018 1:25 PM | Updated on Jul 17 2018 1:25 PM

IMF Lowers India Growth Projection, But It Still Retains World Top Spot - Sakshi

వృద్ధి అంచనాలకు కోత పెట్టిన ఐఎంఎఫ్‌

న్యూఢిల్లీ : పెరుగుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, ఆందోళన పరుస్తున్న డాలర్‌-రూపాయి ఎక్స్చేంజ్‌ రేటు, ద్రవ్యోల్బణం దెబ్బకు కఠినతరమవుతున్న మానిటరీ పాలసీ ఇవ్వన్నీ దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా అప్‌డేట్‌ చేసిన వరల్డ్‌ ఎకానమిక్‌ అవుట్‌లుక్‌లో, దేశీయ వృద్ధి అంచనాలకు కోత పెట్టింది. 2018లో దేశీయ వృద్ధి అంచనాలను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించి, 7.3 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. అదేవిధంగా 2019లో వృద్ది అంచనాలను సైతం 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 7.5 శాతం నమోదవబోతున్నట్టు పేర్కొంది.  అంతకముందు ఇవి 2018లో 7.4 శాతం, 2019లో 7.8 శాతంగా ఉండనున్నట్టు ఐఎంఎఫ్‌ అంచనావేసింది. 

అయితే ఐఎంఎఫ్‌ వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ, భారత్‌ అత్యంత వేగవంతంగా ఆర్థిక వ్యవస్థగానే ఉందని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ రేటు  ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.4 శాతంగానే ఉండనున్నట్టు పేర్కొంది. ఎన్నికల ఏడాదిలో భారత వృద్ధి స్టోరీ ప్రపంచ దేశాలకు పోటీగా ఉంటుందని, ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.9 శాతంగా ఉండబోతున్నట్టు అంచనా వేసింది. ‘వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌లో భారత్‌ వృద్ధి అంచనాలను 2018, 2019ల్లో 0.1 శాతం, 0.3 శాతం చొప్పున తగ్గించాం. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌తో ఆయిల్‌ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం దెబ్బకు అంచనాల కంటే కఠినతరంగా మానిటరీ పాలసీని రూపొందించడం ఇవన్నీ భారత్‌ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపాయి’ అని తన ఐఎంఎఫ్‌ అప్‌డేట్‌లో పేర్కొంది. 

కాగ, గతవారం ప్రపంచ బ్యాంక్‌ విడుదల చేసిన రిపోర్టులో భారత్‌, ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు తెలిసిన సంగతి తెలిసిందే. కాగ, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో గత నాలుగున్నరేళ్లలో మొదటిసారి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీలో రెపో రేటును పెంచుతున్నట్టు ప్రకటించింది. 25 బేసిస్‌ పాయింట్లు పెంచి, రెపో రేటును 6.25 శాతంగా నిర్ణయించింది. ఆర్‌బీఐ భయపడిన విధంగానే టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఎన్నడు లేనంతగా 5.77 శాతానికి ఎగిసింది. ఈ ద్రవ్యోల్బణ భయాలతోనే అర్జెంటీనా, భారత్‌, ఇండోనేషియా, మెక్సికో, టర్కీ లాంటి ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఎకానమీల సెంట్రల్‌ బ్యాంక్‌లు కూడా తమ పాలసీ రేట్లను పెంచాయి.    

Advertisement
 
Advertisement
Advertisement