‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’ | Hero MotoCorp announce temporary production shutdown amid slowdown | Sakshi
Sakshi News home page

‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’

Aug 17 2019 5:09 AM | Updated on Aug 17 2019 5:09 AM

Hero MotoCorp announce temporary production shutdown amid slowdown - Sakshi

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్‌ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్‌ (ఎస్‌సీఎల్‌) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి.

హీరో మోటోకార్ప్‌ ఆగస్టు 15–18 దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్‌ డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్‌లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్‌ డిమాండ్‌ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్‌ ఈ సందర్భంగా వివరించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్‌ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్‌ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్‌సీఎల్‌ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16, 17న (రెండు రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్‌ తదితర సంస్థలు డిమాండ్‌కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మారుతీలో 3 వేల ఉద్యోగాలు కట్‌..
ఆటోమొబైల్‌ రంగంలో డిమాండ్‌ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్‌ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్‌ చేయలేదని సంస్థ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్‌ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్‌ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు.  ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్‌ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement