టర్నోవర్‌లో 3% ఆర్‌అండ్‌డీకి | Havells India, R&D, Galaxy stores | Sakshi
Sakshi News home page

టర్నోవర్‌లో 3% ఆర్‌అండ్‌డీకి

Oct 14 2015 12:44 AM | Updated on Sep 3 2017 10:54 AM

ఎలక్ట్రికల్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హావెల్స్ ఇండియా పరిశోధన, అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది.

అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల తయారీ
 
*  హావెల్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అనిల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హావెల్స్ ఇండియా పరిశోధన, అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీకై ఏటా టర్నోవర్‌లో 3 శాతం ఆర్‌అండ్‌డీపై వెచ్చిస్తోంది. నాణ్యతతోపాటు విద్యుత్‌ను తక్కువగా వినియోగించే ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నట్టు హావెల్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అనిల్ శర్మ మంగళవారమిక్కడ తెలిపారు.

నూతన శ్రేణి స్విచ్‌గేర్లను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘నోయిడాలో కేంద్ర ఆర్‌అండ్‌డీ ఉంది. అలాగే చైనా, యూరప్‌లో మరో నాలుగు ప్రధాన ఆర్‌అండ్‌డీలు ఉన్నాయి. నోయిడా కేంద్రంలో 200 మంది నిపుణులు పనిచేస్తున్నారు. కస్టమర్ల అభిరుచులు మారుతున్నాయి. ప్రపంచస్థాయి ఉత్పత్తులను కోరుతున్నారు. అందుకు తగ్గట్టుగా కంపెనీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది’ అని చెప్పారు. 2014-15లో హావెల్స్ రూ.8,500 కోట్ల టర్నోవర్ సాధించింది.
 
నిర్మాణ రంగంలో కదలికతో..
దేశీయంగా కొన్నేళ్లుగా నిర్మాణ రంగం స్తబ్ధుగా ఉంది. వడ్డీ రేట్లు తగ్గుదల వల్ల ఈ రంగంలో కదలిక వస్తే బిల్డింగ్ ఎలక్ట్రికల్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని  హావెల్స్ వైస్ ప్రెసిడెంట్ ఎ.వి.జగదీశ్ తెలిపారు. భవిష్యత్‌పై ఆశాజనకంగా ఉన్నట్టు చెప్పారు. హావెల్స్ గెలాక్సీ స్టోర్లు దేశవ్యాప్తంగా 330 ఉన్నాయి. డిసెంబర్‌కల్లా వీటి సంఖ్యను 400లకు చేరుస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏపీ, తెలంగాణలో ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్ల సంఖ్య ప్రస్తుతమున్న 20 నుంచి 28కి పెరుగుతుందని వివరించారు.

గెలాక్సీ స్టోర్ల ద్వారా సంస్థకు 2014-15లో రూ.750 కోట్లు సమకూరింది. ఇక ఏపీ, తెలంగాణ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ నమోదైందని హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ ఎ.వి.రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement