
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. జనవరి నుంచీ అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. దీనితోపాటు క్యారెట్ కౌంటింగ్ను తప్పనిసరి చేయాలన్నది కేంద్రం సంకల్పమని ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ఆభరణాల నాణ్యతను గురించి తెలుసుకోలేకపోతున్నారు.
అందుకే మేము హాల్మార్కింగ్ను తప్పనిసరి చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నాము. జనవరి నుంచీ అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాం’’ అని పాశ్వాన్ పేర్కొన్నారు. ‘‘ఒక ఆభరణం 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లలో ఏ కేటగిరీకి చెందిదో వినియోగదారునికి అమ్మకందారు తప్పనిసరిగా ధ్రువీకరించగలగాలి. ఈ మేరకు చర్యలకు కసరత్తు జరగుతోంది’’ అని పాశ్వాన్ వివరించారు.