టెలికం రంగాన్ని ఆదుకుంటాం: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కంపెనీలు తమ సేవలను కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో విలేకర్ల సమావేశం సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు.నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఆర్థిక స్థిరత్వ లేమి కారణంగా ఏ కంపెనీ తమ సేవలను నిలిపివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందడమే తమ అభిమతమని అన్నారు. టెలికం నష్టాలకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు కార్యదర్శుల కమిటీని నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
మరోవైపు టెలికం సంక్షోభాన్ని ప్రభుత్వం పట్టించుకోకుంటే భారత్లో పెట్టుబడుల పెట్టే విషయంలో పునరాలోచిస్తామని వొడాఫోన్ సీఈఓ నిక్ రెడ్ అన్నారు. ఏజీఆర్పై (సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్టెల్ కంపెనీ రూ.23,045 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించాయి. నిబంధనల ప్రకారం ఏజీఆర్లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా రూ.74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్) కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.