
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతానికి చేరింది. ఉద్యోగాల కల్పన మెరుగ్గా ఉండటం, వ్యాపారాలపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజుల ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం ఫెడ్ వెల్లడించింది. దీంతో 2015 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు వడ్డీ రేట్లు పెంచినట్లయింది. ఈ ఏడాది మరోమారు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని ఫెడ్ సూచనప్రాయంగా తెలిపింది.
స్థూల దేశీయోత్పత్తి రెండో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 4 శాతం మేర వృద్ధి నమోదు చేయడం, నిరుద్యోగిత చరిత్రాత్మక కనిష్ట స్థాయి 4 శాతం దరిదాపుల్లో ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం కూడా అంచనాలకు తగ్గట్లు రెండు శాతానికి చేరడం తదితర అంశాలు వడ్డీ రేట్ల పెంపునకు కారణమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, త్వరితగతిన వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం కూడా అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.