
మిస్త్రీకి టాటా ఇండస్ట్రీస్ గుడ్బై
టాటా గ్రూపు చైర్మన్గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని... టాటా ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించారు.
• డైరెక్టర్గా తొలగింపునకు ఓకే
• నేడు టీసీఎస్ వాటాదారుల భేటీ
ముంబై: టాటా గ్రూపు చైర్మన్గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని... టాటా ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి కూడా తొలగించారు. సోమవారం ముంబైలో జరిగిన టాటా ఇండస్ట్రీస్ ఈజీఎంలో వాటాదారులు ఓటు వేసి మిస్త్రీని డైరెక్టర్గా తొలగించినట్టు కంపెనీ ప్రకటించింది. ఆయన చైర్మన్ బాధ్యతలు కూడా ముగిసిపోయినట్టేనని స్పష్టంచేసింది. టాటా గ్రూప్ చైర్మన్గా తొలగించాక జరిగిన పరిణామాలతో... ఆయన్ను గ్రూపులోని అన్ని కంపెనీల నుంచీ బయటకు పంపటానికి టాటా సన్స్ ప్రయత్నిస్తోంది. దీనికోసం ఈ నెలలో పలు కంపెనీలు వాటాదారుల అత్యవసర సమావేశాలను నిర్వహిస్తున్నాయి కూడా. టీసీఎస్ మంగళవారం.. ఇండియన్ హోటల్స్ ఈనెల 20న, టాటా స్టీల్ 21న, టాటా మోటార్స్ 22న, టాటా కెమికల్స్ 23న, టాటా పవర్ 26న ఈజీఎంలు జరపనున్నాయి.
ఇండియన్ హోటల్స్ దిశను మార్చా: మిస్త్రీ
కాగా ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్లో డైరెక్టర్ పదవి నుంచి తొలగింపు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న సైరస్ మిస్త్రీ... వాటాదారుల మద్దతు కోరారు. ఐహెచ్సీఎల్ టర్న్ అరౌండ్ అయ్యేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నానని, వీటి ఫలాలు భవిష్యత్తులో కనిపించనున్నాయని వాటాదారులకు వివరించే ప్రయత్నం చేశారు. డైరెక్టర్ పదవి నుంచి మిస్త్రీని తొలగించేందుకు ఐహెచ్సీఎల్ ఈ నెల 20న ఈజీఎం నిర్వహించనున్న విషయం తెలిసిందే.