‘సెండ్‌ ఫాస్ట్‌’గా డెలివరీ!

Dkart Logistics with 'Startup Diary' - Sakshi

 ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ సహా 200పైగా సంస్థలకు డెలివరీ సేవలు

దక్షిణాది రాష్ట్రాలతో పాటూ సౌదీలోనూ సేవలు షురూ

నెలకు 6 లక్షల డెలివరీలు; ఏపీ, తెలంగాణ వాటా 40 శాతం

5 నెలల్లో రూ.120 కోట్ల నిధుల సమీకరణ పూర్తి

‘స్టార్టప్‌ డైరీ’తో డికార్ట్‌ లాజిస్టిక్స్‌ కో–ఫౌండర్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ–కామర్స్‌ కంపెనీల సక్సెస్‌లో ప్రధానమైంది డెలివరీనే. వేగంగా, నాణ్యంగా ఉత్పత్తులు డెలివరీ అయితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ కొంటారు. కానీ ఈ–కామర్స్‌ సంస్థలన్నీ సొంతగా లాజిస్టిక్స్‌ను ఏర్పాటు చేసుకోలేవు. మెట్రో నగరాల వరకైతే థర్డ్‌ పార్టీ మీద ఆధారపడి పని లాగించేయొచ్చు.

మరి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల పరిస్థితేంటి? ఇదిగో దీన్నే వ్యాపారంగా మలుచుకుంది హైదరాబాద్‌కు చెందిన డికార్ట్‌ లాజిస్టిక్స్‌! ‘సెండ్‌ ఫాస్ట్‌’ బ్రాండ్‌ పేరిట తృతీయ శ్రేణి ప్రాంతాల్లో డెలివరీ... అదీ జస్ట్‌ 24 గంటల్లోనే అందించడం దీని ప్రత్యేకత. అందుకే కాబోలు సంస్థ ప్రారంభించిన 5 నెలల్లోనే ప్రముఖ ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌నూ కస్టమర్‌గా చేసేసుకుంది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్, సీఈఓ కిరణ్‌ కుమార్‌ రెడ్డి ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

‘‘మా స్వస్థలం తిరుపతి. అక్కడే చదివా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్‌ చేశా. అక్కడే లాజిస్టిక్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎంటెక్‌ కూడా పూర్తి చేశా. ఈ–కామర్స్‌ సంస్థలిస్తున్న లాస్ట్‌మైల్‌ డెలివరీ ప్రాముఖ్యం కేవలం మెట్రోలకే పరిమితమవుతున్నాయి.

వాస్తవానికి ఈ–కామర్స్‌లకు వచ్చే ఆర్డర్లలో 50 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉంటాయి. ఆయా ప్రాంతాలకు ఆర్డర్లు వేగంగా చేరితేనే మరింత ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఇదే స్టార్టప్‌ ఆలోచనకు బీజం వేసింది. మొదట్లో సొంతంగా రూ.2 లక్షల పెట్టుబడితో 2015 జూలైలో ప్రారంభించిన డికార్ట్‌ లాజిస్టిక్స్‌లో తర్వాత కార్తీక్, శశాంక్‌ రెడ్డి కో–ఫౌండర్లుగా చేరారు.

ఫ్లిప్‌కార్ట్, మింత్రతో ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందం..
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 50 పట్టణాల్లో డెలివరీ సేవలందిస్తున్నాం. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్ర, బిగ్‌బాస్కెట్, జబాంగ్‌ వంటి 200కు పైగా ఈ–కామర్స్‌ కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నాయి. ఇందులో ఫ్లిప్‌కార్ట్, మింత్ర కంపెనీలకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్స్‌క్లూజివ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఉంది. ప్రస్తుతం మా సంస్థలో 500 మంది డెలివరీ బాయ్స్‌ ఉన్నారు.

మార్చి నాటికి మరో 500 మందిని నియమించుకుంటాం. కుటుంబ నేపథ్యం, విద్యార్హత, స్థానిక పోలీస్‌ వెరిఫికేషన్‌ వంటివి పూర్తయ్యాకే డెలివరీ బాయ్స్‌ను నియమించుకుంటాం. వీరికి వేతనాలు రూ.13 వేల నుంచి ఉంటాయి. మరో 6 నెలల్లో 100 ఈ–కామర్స్‌ కంపెనీలను కస్టమర్లుగా చేర్చాలని లకి‡్ష్యంచాం. పేటీఎంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు విస్తరించనున్నాం. ఆ తర్వాత దశలవారీగా దేశమంతటా సేవలను విస్తరిస్తాం.

ఈ ఏడాది రూ.10 కోట్ల వ్యాపారం లక్ష్యం
ప్రస్తుతం నెలకు 6 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాం. ఇందులో 2.5–3 లక్షల ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉంటాయి. ఏపీ, తెలంగాణ నుంచి 40 శాతం వాటా ఉంటుంది. ప్రతి ఆర్డర్‌ డెలివరీ మీద ఈ–కామర్స్‌ కంపెనీల నుంచి రూ.35 చార్జీ తీసుకుంటాం. నెలకు రూ.65–70 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం.

గతేడాది రూ.3 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేశాం. ఈ ఏడాది రూ.10 కోట్లు లకి‡్ష్యంచాం. గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న యువతకు ఉద్యోగ, ఆదాయ మార్గాలను కల్పించేందుకు కొత్తగా నెట్‌వర్క్‌ పార్ట్‌నర్‌ను ప్రారంభించాం. ఇదేంటంటే.. మా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ–కామర్స్‌ కంపెనీల ఆర్డర్లను డెలివరీ చేయవచ్చు. ప్రస్తుతం విశాఖపట్నం, భీమవరం, వరంగల్‌ వంటి ప్రాంతాల నుంచి 25 మంది నెట్‌వర్క్‌ పార్ట్‌నర్‌షిప్‌ తీసుకున్నారు. రెండేళ్లలో దీన్ని వెయ్యి మందికి చేర్చాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుత నెట్‌వర్క్‌ పార్ట్‌నర్స్‌ మా ద్వారా నెలకు రూ.50 వేల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

రూ.120 కోట్ల నిధుల సమీకరణ..
ఇటీవలే సౌదీలోని రిటైల్‌ స్టోర్‌ గ్రూప్‌ సినర్జీ గ్లోబల్‌తో డెలివరీ ఒప్పందం చేసుకున్నాం. స్థానికంగా కొన్ని అనుమతులు రావాలి. ఆయా సేవలకు గాను ప్రతి డెలివరీపై రూ.40 చార్జీ ఉంటుంది. లైన్‌ హాల్‌ పేరిట సిటీ నుంచి సిటీ లాజిస్టిక్స్‌ సేవలు కూడా అందిస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 5 టన్నుల వరకు డెలివరీ చేస్తున్నాం. దీనికి కిలోకు రూ.50 వరకు చార్జీ ఉంటుంది.

గతేడాది ప్రారంభంలో హైదరాబాద్‌ ఏంజిల్స్‌ నుంచి రూ.1 కోటి సమీకరించాం. తాజాగా రూ.120 కోట్లు సమీకరిస్తున్నాం. అమెరికాకు చెందిన 3 ఇన్వెస్టర్స్‌ క్లబ్స్‌తో చర్చలు జరుపుతున్నాం. ఒకటి పూర్తయింది. ఈక్విటీ ఆడిట్‌ జరుగుతోంది. మరో 5 నెలల్లో డీల్‌ను క్లోజ్‌ చేస్తాం’’ అని కిరణ్‌ కుమార్‌ వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top