ఎమ్‌సీఎక్స్‌లో ఇత్తడి ఫ్యూచర్స్‌ | Sakshi
Sakshi News home page

ఎమ్‌సీఎక్స్‌లో ఇత్తడి ఫ్యూచర్స్‌

Published Fri, Mar 23 2018 1:13 AM

Brass futures at MCX - Sakshi

ముంబై: మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎమ్‌సీఎక్స్‌) ఇత్తడి లోహంలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించనుంది. ఇత్తడి లోహంలో ఫ్యూచర్స్‌  ట్రేడింగ్‌ జరగడం  ప్రపంచంలో ఇదే తొలిసారి. ఈ నెల 26 నుంచి ఏప్రిల్, మే, జూన్‌ నెల కాంట్రాక్టులను ఆఫర్‌ చేస్తామని ఎమ్‌సీఎక్స్‌ తెలిపింది. లాట్‌ సైజ్‌ ఒక టన్ను అని ఎమ్‌సీఎక్స్‌ ఎండీ, సీఈఓ మృగాంక్‌ పరాంజపే తెలిపారు. ఇత్తడి ఫ్యూచర్స్‌... ఇత్తడి లోహానికి వ్యవస్థీకృత ధరను నిర్ణయించే ప్లాట్‌ఫామ్‌గానే కాకుండా జాతీయ స్థాయి ప్రమాణ ధరగా కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ధరలకు సంబంధించి నష్ట భయాన్ని హెడ్జింగ్‌ చేసుకోవడానికి కూడా ఈ ఇత్తడి ఫ్యూచర్స్‌ ఉపయోగపడతాయన్నారు. ఐరన్‌ కాకుండా తప్పనిసరి డెలివరీ ఆప్షన్‌ ఉన్న తొలి ఫ్యూచర్స్‌ కూడా ఇదేనని తెలిపారు. డెలివరీ సెంటర్‌ అయిన జామ్‌నగర్‌ వేర్‌హౌస్‌ ధర కోట్‌ అవుతుందని, అన్ని ట్యాక్స్‌లు, సుంకాలు దీంట్లో కలిసి ఉంటాయని, జీఎస్‌టీ అధికమని వెల్లడించారు. 

హెడ్జింగ్‌కు వీలు: ఇత్తడికి మంచి ధర వచ్చేలా ఈ ఇత్తడి ఫ్యూచర్స్‌ తోడ్పడుతాయని, ఇది ఈ లోహ సంబంధిత దిగుమతిదారులు, ఎగుమతిదారులు, తయారీదారులు, రిఫైనరీ, ప్రాసెసింగ్‌ చేసే వ్యక్తులకు ప్రయోజనకరమని పరాంజపే  తెలిపారు. ఇత్తడి తయారీకి కావలసిన మొత్తం స్క్రాప్‌ను దాదాపు దిగుమతి చేసుకుంటున్నామని జామ్‌నగర్‌ ఫ్యాక్టరీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ తుల్సీభాయ్‌ గజేరా చెప్పారు. ఈ షిప్‌మెంట్స్‌ భారత్‌లోకి వచ్చేదాకా వాటి ధరల వివరాలు నిర్ణయం కావన్నారు. ఎమ్‌సీఎక్స్‌ ఇత్తడి ఫ్యూచర్స్‌ వల్ల దిగుమతిదారులు తమ నష్ట భయాన్ని హెడ్జింగ్‌ చేసుకునే వీలు కలుగుతుందని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement