ఐబీఏ ఫోరెన్సిక్‌ ఆడిటర్ల జాబితాలో దిగ్గజ సంస్థలు

ఐబీఏ ఫోరెన్సిక్‌ ఆడిటర్ల జాబితాలో దిగ్గజ సంస్థలు - Sakshi


న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించనున్న ఆడిటర్ల జాబితాలో దిగ్గజ సంస్థలకూ చోటు దక్కింది. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) రూపొందించిన జాబితాలో కేపీఎంజీ, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై), డెలాయిట్, ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ ఉన్నాయి. ఇంకా బీఎంఆర్‌ అడ్వైజర్స్, చోక్సి అండ్‌ చోక్సి ఎల్‌ఎల్‌పీ, గ్రాంట్‌ థార్న్‌టన్, ముకుంద్‌ ఎం చితాలే అండ్‌ కో సైతం ఫోరెన్సిక్‌ ఆడిటర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. మొత్తం మీద 39 ఆడిట్‌ సంస్థలతో ఐబీఏ ఈ జాబితాను రూపొందించింది.


ఈ సంస్థలు బ్యాంకుల్లో రూ.50 కోట్లకుపైగా విలువైన మోసాలకు సంబంధించి ఆడిట్‌ నిర్వహించనున్నాయి. అలాగే రూ.50 కోట్లకు లోపున్న మోసపూరిత కేసుల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం గాను 73 ఆడిట్‌ సంస్థలను ఐబీఏ గుర్తించింది. బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో రూ.లక్షకు పైన విలువతో కూడిన మోసాల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. 2012–13లో వీటి సంఖ్య 4,235గా ఉంటే, 2016–17లో 5,076 కేసులు నమోదయ్యాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.69,769 కోట్ల విలువ మేర మోసాలు జరిగాయి. ఇందుకు సంబంధించి 22,949 కేసులు వెలుగు చూడడం గమనార్హం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top