జియోమీట్‌కు పోటీ : ఎయిర్‌టెల్‌ త్వరలోనే

Bharti Airtel to soon launch video-conferencing app for businesses: Report - Sakshi

సాక్షి, ముంబై:  కరోనా, లాక్‌డౌన్‌ సంక్షోభం మధ్య ప్రపంచవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే టెలికాం ఆపరేటర్ రిలయన్స్‌ జియో తన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్‌ను జియో మీట్‌ను ప్రవేశపెట్టగా, తాజాగా జియో  ప్రత్యర్థి, ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ కూడా ఈ సేవల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక కొత్త వీడియో-కాన్ఫరెన్సింగ్  యాప్‌ ను ఎయిర్‌టెల్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. యూనిఫైడ్‌ వీడియో కాన్ఫరెన్సింగ​ టూల్‌తో పాటు మరికొన్నింటిని లాంచ్‌ చేయనున్నట్టు సమాచారం.

తన వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలను ప్రారంభంలో కంపెనీలకు మాత్రమే అందించనుంది. అలాగే మొబైల్, డెస్క్‌టాప్‌లో వీడియో-కాన్ఫరెన్సింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రధానంగా సరికొత్త ఏఈఎస్‌ 256 ఎన్‌క్రిప్షన్‌, వివిధ  దశల్లో సెక్యూరిటీ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వనుందని తెలుస్తోంది. తర్వాత సాధారణ వినియోగదారులకు ఈ యాప్‌ను అందించనుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.  సైబర్ భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య డేటా, భద్రతకు ఎయిర్‌టెల్ ప్రాధాన్యత ఇస్తుందని నివేదిక తెలిపింది. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌,  గూగుల్ హ్యాంగ్అవుట్‌ల వంటి ప్రస్తుత సేవలకు భిన్నంగా ఉండేలా ప్లాన్‌ చేస్తోందట. అయితే ఈ అంచనాలపై ఎయిర్‌టెల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా  రిలయన్స్ ఇండస్ట్రీస్  టెలికాం విభాగం రిలయన్స్‌ జియో ఇటీవల లాంచ్‌ చేసిన జియోమీట్‌తోపాటు, మార్కెట్లోని ఇతర సంస్థలకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top