బీవోఎం నుంచి మహా మొబైల్ యాప్ | Bank of Maharashtra launches mobile app | Sakshi
Sakshi News home page

బీవోఎం నుంచి మహా మొబైల్ యాప్

Feb 3 2015 3:49 AM | Updated on Sep 2 2017 8:41 PM

బీవోఎం నుంచి మహా మొబైల్ యాప్

బీవోఎం నుంచి మహా మొబైల్ యాప్

ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది.

* లక్ష యూజర్ల నమోదు లక్ష్యం
* వచ్చే ఏడాది ఫాలోఆన్ పబ్లిక్ ఇష్యూ ఆలోచన
* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ ఆర్.ఆత్మారామ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ప్రస్తుత లావాదేవీల్లో 50 శాతం ఎలక్ట్రానిక్ రూపంలోనే జరుగుతుండగా వచ్చే ఏడాదిలో ఇది 75 శాతం దాటుతుందని అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ‘మహా మొబైల్’పేరుతో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బీవోఎం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్ ఆత్మారామ్ ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించారు. తదుపరి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగిస్తున్న యువతను దృష్టిలో పెట్టుకొని ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో అందిస్తున్న చాలా సేవలు మొబైల్ బ్యాంక్ ద్వారా వినియోగించుకోవచ్చని, దీంతో సెలవు రోజుల్లో కూడా నగదు పంపవచ్చన్నారు. ఏడాదిలోగా లక్ష మంది ఖాతాదారులను మహా మొబైల్ యాప్ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
 
వచ్చే ఏడాది ఇష్యూకి..
వ్యాపార విస్తరణకు వచ్చే ఆర్థిక సంవత్సరం నిధులు అవసరమవుతాయని ఆత్మారామ్ తెలిపారు. కేంద్రం నిధులు సమకూర్చకపోతే మార్కెట్ పరిస్థితులను బట్టి ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు వస్తామన్నారు. ప్రస్తుతం షేరు ధర చాలా చౌక ట్రేడ్ అవుతుడటంతో ఇష్యూ ఆలోచన లేదని, ధర పెరిగితే ఇష్యూకు వస్తామన్నారు.

అధిక వడ్డీరేట్లు ఉన్న డిపాజిట్లను వదలించుకొని ఇదే సమయంలో అధిక వడ్డీ లభించే రుణాలపై దృష్టిసారించడం ద్వారా బ్యాంకు లాభదాయకతను పెంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వ్యాపారంలో 12-15 శాతం వృద్ధిని, వచ్చే ఏడాది 18% వృద్ధిని అంచనా వేస్తున్నామన్నారు. రుణ రేటు పావుశాతం తగ్గవచ్చు..:మంగళవారంఆర్‌బీఐ మరో పావు శాతం వడ్డీరేట్లను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement