
న్యూఢిల్లీ: నల్లధనంపై పోరులో భాగంగా మరో 1.20 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే 2.26 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు వీటితో అనుబంధం కలిగిన 3.09 లక్షల మంది డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించింది. ఇవి చాలా కాలంగా ఎటువంటి కార్యకలాపాలు లేకుండా, నిబంధనలను పాటించకుండా ఉండటంతో ఈ చర్య తీసుకుంది. తాజా సమీక్షా సమావేశంలో భాగంగా నిబంధనలను పాటించని 1.2 లక్షల కంపెనీలను రికార్డుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీలపై వేగంగా చర్యలు తీసుకోవాలని సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి.చౌదరి అధికారులను ఆదేశించారు. కాగా, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో (ఎన్సీఎల్టీ) ఆదేశాల మేరకు అవసరమైన నిబంధనలను అమలు చేసిన 128 కంపెనీల రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించడం జరిగింది’’ అని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది.